తొలిదశలో ఫ్రంట్లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్: మోడీ
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యత ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యత ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.
వ్యాక్సిన్ పంపిణీపై సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించారు. మూడు కోట్ల టీకాల పంపిణీ తర్వాత మరోసారి సీఎంలతో భేటీ కానున్నట్టుగా ఆయన చెప్పారు.
వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తానని ఆయన తెలిపారు. తొలి దశలో ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు టీకా ఇస్తామన్నారు.
అయితే వీరిలో ప్రజా ప్రతినిధులు ఉండబోరని మోడీ స్పష్టం చేశారు. రెండో దశలో 50 ఏళ్లకు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్లలోపువారికి ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు.
ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల మంది మాత్రమే టీకా తీసుకొన్నారని మోడీ గుర్తు చేశారు. జూలై నాటికి దేశంలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ డ్రైరన్ పూర్తైందన్నారు.
టీకాలపై వదంతులు వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రాలపై వ్యాక్సినేషన్ భారం వేయడం లేదన్నారు.
విదేశీ వ్యాక్సిన్ల కంటే డీసీజీఐ అనుమతి ఇచ్చిన రెండు దేశీయ వ్యాక్సిన్లు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నవన్నారు. అంతేకాదు దేశ అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడ్డాయని ఆయన చెప్పారు.
వ్యాక్సినేషన్ కోసం శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తమ పౌరులకు సమర్ధవంతమైన వ్యాక్సిన్లను అందించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని మోడీ చెప్పారు.