బారామతి లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలేను మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ ఎన్సీపీ రాష్ట్ర కార్యాలయం వెలుపల భారీ పోస్టర్ను ఏర్పాటు చేశారు. దీంతో ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. దానిని అతికించిన వ్యక్తిని కనుక్కోవాలని ముంబై పోలీసులను కోరారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)లో గత కొన్ని రోజులుగా పోస్టర్ వార్ జరుగుతోంది. ముంబైలోని ఎన్సీపీ కార్యాలయం వెలుపల కాబోయే సీఎం అంటూ.. పార్టీలలోని అగ్ర నేతల పోస్టర్లు ఒకరి తర్వాత ఒకరివి వెలుస్తున్నాయి. తొలుత జయంత్ పాటిల్, ఆ తర్వాత అజిత్ పవార్.. తాజాగా.. ఎంపీ సుప్రియా సూలే పోస్టర్ వెలిసింది.
బుధవారం రాత్రి NCP కార్యాలయం వెలుపల మహారాష్ట్రకు కాబోయే సీఎం అంటూ.. ఎంపీ సుప్రియా సూలే పోస్టర్ ప్రత్యేక్షమైంది. పోస్టర్లో శరద్ పవార్ ఫోటో కూడా ఉంది. ఈ పోస్టర్లు వెలువడటం వల్ల ఎన్సీపీలో అనైక్యత రగులుతోందనే ప్రచారం ప్రారంభమైంది. అందుకే పార్టీలోని అగ్రనేతలు తమ ప్రబల్యాన్ని చూపించుకోవడానికి.. కాబోయే సీఎం అంటూ పరోక్షంగా కార్యకర్తలతో పోస్టర్లు వేసుకుంటున్నారనే వాదన కూడా ఉంది. మరోవైపు పార్టీలో అగ్ర నేతల మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరుకున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
ఈ ఘటనపై ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఆ పోస్టర్ లో తనకు ఎలాంటి సంబంధం లేదనీ, తనకు తెలియకుండా పోస్టర్లు అంటించారని తెలిపారు. పాటిల్ ఫోటోను ఓ కార్యకర్త పెట్టాడని, అయితే.. తన అనుమతి లేకుండా అజిత్ పవార్ను, తన ఫోటోను ఎవరు పెట్టారనే దానిపై విచారణ జరగాలని అన్నారు. ఈ పోస్టర్లు ఎవరు అంటించారో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు.
ఈ పోస్టర్లు వేయడం వెనుక వారి ఉద్దేశం ఏంటని.. రాత్రి రాత్రికి ఇలాంటి పోస్టర్లు ఎందుకు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మహిళగా తాను బాధపడ్డానని.. తెలియకుండా పోస్టర్లు వేయడం తన గోప్యతకు భంగం కలిగించడమేననీ, ఈ విషయంపై దర్యాప్తు చేయవలసిందిగా తాను పోలీసులను కోరుతున్నానని పేర్కోన్నారు. ఇది తన, తన పార్టీ భద్రతకు సంబంధించినదని అన్నారు. మరోవైపు ఎంఆర్ఏ మార్గ్ పోలీసులను ప్రశ్నించగా.. ఈ పోస్టర్లపై సుప్రియ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది.
ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పుట్టినరోజు అంటే ఫిబ్రవరి 16 నుంచి పోస్టర్ వార్ మొదలైంది. నేపెన్సియా రోడ్ ప్రాంతంలో మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి జయంత్ పాటిల్ అంటూ పోస్టర్ వేశారు. ఆ తర్వాత అజిత్ పవార్ను కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ పోస్టర్ను అంటించారు. తొలి మహిళా ముఖ్యమంత్రిగా సుప్రియా సూలే పోస్టర్లు బుధవారం రాత్రి వెలువడ్డాయి.
అజిత్ పవార్, సుప్రియా సూలే పోస్టర్ల కింద ఎవరి పేరు కూడా రాయలేదు. అదే సమయంలో కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఎన్సీపీకి చెందిన ముగ్గురు పెద్ద నేతల పోస్టర్లు బయటకు రావడంతో ఇప్పుడు ఆ ముగ్గురు ప్రముఖుల్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్సీపీలో టగ్ ఆఫ్ వార్ మొదలైందా అనే ప్రశ్న మొదలైంది.
