PFI: పీఎఫ్ఐపై నిషేధం నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్
Popular Front Of India: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అణిచివేత చర్యలు తీవ్రతరం కావడంతో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్లో ఉన్నారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం, జాతీయ రాజధానిలోని సున్నితమైన ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను కూడా మోహరిస్తున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తక్షణ చర్యలు తీసుకోవడానికి ముందస్తుగా సన్నద్ధం అవుతున్నట్టు చెబుతున్నారు.
Popular Front of India Banned: ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నాయకులు, సిబ్బంది ఇండ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలోనే కేంద్రం దీనిపై నిషేధం వించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్లపాటు కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల కార్యకలాపాలు ముమ్మరం చేశారు. వివిధ జిల్లాల్లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీలు) కూడా వీధుల్లోకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. 2020లో అల్లర్లు జరిగిన ఈశాన్య జిల్లాలో కమ్యూనిటీల మిశ్రమ జనాభా ఉంది. ఇటీవల, ఈ ప్రాంతం నుండి పీఎఫ్ఐతో సంబంధం ఉన్న ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఏఎన్ఐతో మాట్లాడిన డీసీపీ సంజయ్ కుమార్, "మేము హై అలర్ట్ మోడ్లో ఉన్నాము. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఈశాన్య జిల్లాలో తాజా పరిస్థితులను తెలుసుకోవడానికి ముందస్తు చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. ఏదైనా ప్రాంతంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగే విధంగా ఘటనలు చోటుచేసుకోగానే.. ఎల్లో అలర్ట్ లో భాగంగా సమాచారం అందిన వెంటనే ఏసీపీలు, ఎస్ హెచ్ వో బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకుంటాయని చెప్పారు. అదే సమయంలో, మరొక రిజర్వ్ విభాగం హై అలర్ట్ లో ఉంటుందన్నారు. వజ్ర, వాటర్ కానన్ సహా ఇతర విభాగాలు కూడా లక్ష్యానికి చేరుకుంటాయని అధికారి తెలిపారు. ఒక పోలీసు స్టేషన్ పరిధిలో పరిస్థితి మరింత దిగజారితే, ఆరెంజ్ పథకం 3-4 పోలీసు స్టేషన్లలో అమలు చేయబడుతుంది. జిల్లా మొత్తం ప్రభావితమైనప్పుడు రెడ్ స్కీమ్ చర్యలు తీసుకోబడతాయి.
ఢిల్లీ పోలీసుల ప్రకారం, జాతీయ రాజధానిలోని సున్నితమైన ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను కూడా మోహరిస్తున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తక్షణ చర్యలు తీసుకోవడానికి ముందస్తు చర్యలుగా చెబుతున్నారు. నార్త్ వెస్ట్ జిల్లా డీసీపీ, ఇతర జిల్లా డీసీపీలు వారి వారి పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర ఏజెన్సీలు-పోలీసు బలగాలు పీఎఫ్ఐ క్యాడర్లకు అనుసంధానించబడిన దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక దాడులలో 100 మందికి పైగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను అరెస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత.. కేంద్ర ప్రభుత్వం, పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలకు వ్యతిరేకంగా చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం అధికారాలను ఉపయోగించి బ్యాన్ విధిస్తూ.. దానిని కార్యకలాపాలను స్తంభింపజేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను (UTలు) ఆదేశించింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగానూ పీఎఫ్ఐ, దాని సహచరులపై నిషేధం విధించినట్లు కేంద్రం నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. దేశంలో మిలిటెన్సీకి మద్దతు ఇస్తున్నదనే అంశాలను ప్రస్తావించింది.