పంజాబ్: ఎన్నికల వేళ అమరీందర్ సింగ్కు షాక్, సలహాదారు పదవికి ప్రశాంత్ కిశోర్ రాజీనామా
పంజాబ్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు ప్రధాన సలహాదారుగా వున్న ప్రశాంత్ కిశోర్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కి కొన్ని నెలలుగా ప్రధాన సలహాదారుగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ఆ పదవికి రాజీనామా చేశారు. కొంత కాలంపాటు వ్యక్తిగత జీవితంపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీకే ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే తన భవిష్యత్తు కార్యాచరణపై కూడా తాను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. తనను ప్రధాన సలహాదారు పదవి నుంచి రిలీవ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ప్రశాంత్ కిశోర్ను తన ప్రధాన సలహాదారుగా అమరీందర్ సింగ్ నియమించుకున్న సంగతి తెలిసిందే.
అయితే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ను గెలిపించేందుకు మమతా బెనర్జీ తరఫున వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. బీజేపీని మట్టికరిపించి ఆ రాష్ట్రంలో టీఎంసీ గెలిచింది. ఎన్నికల ఫలితాల అనంతరం తాను వ్యూహకర్తగా ప్రత్యక్షంగా పనిచేయబోనని, తన బృందం మాత్రం పనిచేస్తుందని పీకే ప్రకటించి సంచలనం రేపారు. ఇటీవల దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల అధినేతలతో చర్చించి ఆయన వార్తల్లో నిలిచారు. ఈ సమయంలో అమరీందర్ ప్రధాన సలహాదారు పదవికి ఆయన రాజీనామా చేయడం గమనార్హం