సోషల్ మీడియాలో వెదర్ అప్డేట్.. తిరుపతి యువకుడిపై మోడీ ప్రశంసలు
మన్ కీ బాత్ సందర్భంగా తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ అనే యువకుడిని ప్రధాని మోడీ ప్రశంసించారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తోన్న సాయి ప్రణీత్ తాను రైతులకు అందిస్తోన్న సేవలకు గాను ఐక్యరాజ్యసమితి, భారత వాతావరణ శాఖ నుంచి కూడా గతంలో ప్రశంసలు అందుకున్నారు
తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ అనే యువకుడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోడీ.. ఆదివారం జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో రైతులకు ఏపీ వెదర్ మన్ పేరుతో వాతావరణ సమాచారం అందిస్తూ సాయి ప్రణీత్ మంచి పని చేస్తున్నారని మోడీ ప్రశంసించారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తోన్న సాయి ప్రణీత్ తాను రైతులకు అందిస్తోన్న సేవలకు గాను ఐక్యరాజ్యసమితి, భారత వాతావరణ శాఖ నుంచి కూడా గతంలో ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ యువకుడి సేవలను మన్ కీ బాత్లో మోడీ ప్రస్తావించారు.
అలాగే, చండీగఢ్కు చెందిన 29 ఏళ్ల సంజయ్ రాణాను కూడా మోదీ ప్రశంసించారు. ఆ యువకుడు ఫుడ్ స్టాల్ ను నిర్వహిస్తుంటాడని, సైకిల్ పై తిరుగుతూ ఛోలే భతూర్ అనే వంటకాన్ని అమ్ముతుంటాడని మోడీ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆయన ఉచితంగా దాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని కొనియాడారు.
మరోవైపు, తమిళనాడులోని నీలగిరికి చెందిన రాధిక శాస్త్రి అనే మహిళ అమ్బర్క్స్ ప్రాజెక్ట్ చేపట్టి సేవలందిస్తున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. కొండ ప్రాంతాల ప్రజలు ఆసుపత్రులకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని వారి కోసం ఆమె ఉచితంగా రవాణా సదుపాయాలను కల్పిస్తున్నారని కొనియాడారు. తన సహచర ఉద్యోగుల వద్ద విరాళాలు సేకరించి ఆమె ఈ సేవలు కొనసాగిస్తున్నారని మోడీ వివరించారు. ఆమె మొత్తం ఆరు అమ్బర్క్స్ (ప్రత్యేక ఆటోల ద్వారా వైద్య సదుపాయం) సర్వీసులు నడిస్తున్నారని కొనియాడారు.
కాగా, పండుగలు, శుభకార్యాలు జరుపుకునే సమయంలో కరోనా ఇంకా తొలగిపోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మోడీ దేశ ప్రజలకు సూచించారు. కరోనా ఇంకా మన మధ్యే ఉందని, కొవిడ్ నియంత్రణ నియమాలను పాటించాలని ఆయన చెప్పారు.