కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ అని తేలింది. బుధవారం సాయంత్ర ఆమెకు కరోనా టెస్టు చేయగా ఈ విషయం వెల్లడైంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వార్తపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వీలైనంత వేగంగా కరోనా నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఆమె త్వరగా ఆ మహమ్మారి నుంచి కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీజీ వేగంగా కొవిడ్ 19 నుంచి రికవరీ కావాలని కోరుకుంటున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.
సోనియా గాంధీ కరోనా బారిన పడ్డట్టు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా గురువారం(జూన్ 2) వెల్లడించారు. గత వారం రోజులుగా ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నట్టు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని సుర్జేవాలా తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెకు స్వల్ప జ్వరం వచ్చిందని వివరించారు. దీంతో ఆమె కరోనా టెస్టు చేసుకున్నారని తెలిపారు. ఈ టెస్టులో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని అన్నారు. ఆమెకు కొన్ని కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే ఐసొలేషన్లోకి వెళ్లారని చెప్పారు. మెడికల్ కన్సల్టేషన్ పూర్తయిందని, ఆమె ఇప్పుడు కోలుకుంటున్నారని వివరించారు. ఇప్పటి వరకైతే.. ఈడీ ముందు ఆమె హాజరయ్యే తేదీల్లో మార్పు లేదని తెలిపారు.
ఆమె వేగంగానే కోలుకుంటున్నారని, కాబట్టి, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరయ్యే తేదీల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని ఆయన వివరించారు. అంతేకాదు, సోనియా గాంధీతో సమావేశమైన వారూ కరోనా టెస్టులు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
