అహ్మదాబాద్ కు మరో మణిహారం.. రివర్ఫ్రంట్ ఎఫ్ఓబి.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
అహ్మాదాబాద్ లో మరో చారిత్రక నిర్మాణానికి ప్రధాని మోదీ శనివారం ప్రారంభోత్సవం చేయనున్నారు. తూర్పు- పశ్చిమ ఒడ్డులను కలిపే ఈ రివర్ ఫ్రంట్ ఎఫ్ వోబీ మరో అద్భుతమైన ఆకర్షణగా మారనుంది.
న్యూఢిల్లీ : గత వారం భారత్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా.. అనేక కార్యక్రమాలతో జరుపుకుంది. అదే రోజున, అహ్మదాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సబర్మతి రివర్ ఫ్రంట్ కూడా ఒక దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ ను చూడడానికి పర్యాటకులు, సందర్శకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, ఎల్లిస్ బ్రిడ్జ్, సర్దార్ బ్రిడ్జ్ ల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో మరో ఆకర్షణ తోడయ్యింది.
సబర్మతి రివర్ ఫ్రంట్కు తూర్పు, పడమర ప్రాంతాలను కలిపే ఈ 300 మీటర్ల వంతెనను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన బహుళ స్థాయి కార్ పార్కింగ్ ఉంది. తూర్పు- పశ్చిమ ఒడ్డున ఉన్న వివిధ రకాల పబ్లిక్ డెవలప్ మెంట్ లకు అనుసంధానం కల్పిస్తుంది.
వెస్ట్ బ్యాంక్లోని ఫ్లవర్ పార్క్, ఈవెంట్ గ్రౌండ్ మధ్య ప్లాజా నుండి ఈస్ట్ బ్యాంక్లోని ప్రతిపాదిత ఆర్ట్ / కల్చరల్ / ఎగ్జిబిషన్ సెంటర్ వరకు ఇది ఉంటుంది. సాంకేతికంగా, విజువల్ గా కూడా అద్భుతంగా, రూపకల్పనలో విభిన్నంగా ఉన్న ఈ రివర్ ఫ్రంట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అహ్మదాబాద్ ఖ్యాతిని పెంచుతుంది. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతంగా మారుతుంది.