అనుభూతిని మాటల్లో చెప్పలేను.. ఐఎన్ఎస్ విక్రాంత్ వీడియోను షేర్ చేసిన ప్రధాని..
ఐఎన్ఎస్ విక్రాంత్ను భారత నావికాదళానికి అప్పగించిన తర్వాత ప్రధాని శనివారం ఒక వీడియోను పంచుకున్నారు. ఈ సమయంలో ప్రధాని మోడీ పొందిన తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అదే.. ఐఎన్ఎస్ విక్రాంత్.. భారతదేశం.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి విమాన వాహక యుద్ద నౌక ఇది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జలప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ కూడా యుద్ధనౌకలను తయారు చేసే అగ్రదేశాల సరసన నిలిచింది.
కాగా, భారత నౌకాదళానికి యుద్ధనౌకను అప్పగించిన తర్వాత ప్రధాని శనివారం ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. INS విక్రాంత్లో పొందిన అనుభూతిని పంచుకున్నాడు. ఆ అనుభవం చాలా గర్వంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేదని పేర్కొన్నారు. 'భారతదేశానికి చారిత్రాత్మకమైన రోజు... నేను నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రయాణించినప్పుడు కలిగిన అనుభూతిని, గర్వాన్ని మాటల్లో చెప్పలేను' అని ట్వీట్లో రాశారు.
ఐఎన్ ఎస్ విక్రాంత్ ఆవిష్కరణ సందర్భంలో ప్రధాని మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక ఆవిష్కరణతో ప్రపంచ పటంలో భారత్ సమున్నత స్థాయిలో నిలిచిందన్నారు. ఈ యుద్ద నౌక తో మనమిప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడ్డామని అన్నారు. ఈ యుద్ధనౌక.. భారత దేశ కృషికీ, ప్రతిభ, నిబద్దతకు నిదర్శనమని కొనియాడారు. అలాగే.. ప్రధాని మోడీ నేవీ జెండాను కూడా ఆవిష్కరించారు. దేశం బానిసత్వపు ముద్రను, బానిసత్వ భారాన్ని తీసివేసిందని అన్నారు.
1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన మాజీ నేవీ షిప్ విక్రాంత్ పేరు మీదుగా ఈ నౌకకు పేరు పెట్టారు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లోని కొన్ని ప్రత్యేకత గురించి ప్రధాని మాట్లాడారు. 'తేలియాడే ఎయిర్ఫీల్డ్, తేలియాడే నగరం' అని ఆయన అభివర్ణించారు. ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తో 5,000 ఇళ్లకు వెలుగులు నింపవచ్చని తెలిపారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ను మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి అంకితమిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 2022 సెప్టెంబరు 2న చారిత్రాత్మకమైన రోజున మరో చరిత్రను మార్చే చర్య జరిగిందని అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్తో భారతదేశం బానిసత్వం జాడ తొలిగిపోయిందని అన్నారు. నేటి నుంచి ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో సముద్రంలో, ఆకాశంలో నేవీ కొత్త జెండా రెపరెపలాడనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నౌకాదళంలో INS విక్రాంత్ చేర్చడంతో స్వదేశీ పరిజ్ఞానంతో విమాన వాహక నౌకను నిర్మించగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉన్న US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల సరసన భారతదేశం చేరింది.
ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మొదటి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లో చాలా ప్రత్యేకతలున్నాయి. మొత్తం 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తుతో కూడిన ఉన్న ఈ భారీ యుద్ధనౌక 28 నాటికల్ మైళ్ల వేగంతో 7500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.
దాదాపు 45 వేల టన్నుల బరువుండే INS విక్రాంత్ నిర్మాణం కోసం ఇరవై వేల కోట్ల రూపాయాలను వెచ్చించారు. దేశీయంగా తయారు చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్హెచ్)తో పాటు మిగ్-29కె ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్తో సహా 30 విమానాలను ఆపరేట్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. షిప్లో 16,00 మంది సిబ్బంది ఉంటారు. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఇందులో 16 పడకల ఆస్పత్రి కూడా ఉంది.