PM security lapse: ప్రధాని కార్యక్రమాన్ని పక్కదారి పట్టించే పంజాబ్ ప్రభుత్వ కుట్రే అది: రిటైర్డ్ ఐఏఎస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పర్యటనలో అతిపెద్ద భద్రతా లోపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఐఏఎస్ అధికారి. పోలీసులే స్వయంగా నిరసన తెలిపి.. మోడీ భద్రతను బెదిరించారనీ, దానికి నేనే సాక్షిని అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ లాధర్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యాటన రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ కాంగ్రెస్ ల మధ్య ఈ ఘటన పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి తీసుకెళ్లింది.PM modi పర్యటనను అడ్డుకోవడం, భద్రతా లోపంపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఘటన సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ పర్యటనలో భద్రతను కల్పిస్తున్న పంజాబ్ పోలీసులపై ఓ మాజీ ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకోవడం.. నిరసనలకు దిగిన రైతులతో కలిపి పంజాబ్ పోలీసులు ఆందోళన చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ పోలీసులు మోడీ పర్యటనను అడ్డుకోవడంతో పాటు ఆయన భద్రతను బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. పంజాబ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ర్యాలీని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రధాని మోడీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే ప్రత్యక్ష బాధ్యత అని వివరించారు. దీనికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ లాధర్ విజ్ఞప్తి చేశారు. పోలీసులే రైతులను అక్కడికి తెచ్చారని, ఆ తర్వాత ఆందోళనలు వారి అదుపు తప్పాయని పేర్కొన్నారు. అంతేకాదు, అక్కడ కొందరి ప్రాణాలు పోయే ముప్పు ఏర్పడిందని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పర్యటనను ప్రధాన భద్రతా లోపం కారణంగా రద్దు చేసుకున్నారు. హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, PM modi కాన్వాయ్ ఫ్లైఓవర్కు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డుకున్నట్లు కనుగొనబడింది. ప్రధాని 15-20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్పై ఇరుక్కుపోయారు. దీనిపై అనేక రకాల వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ పంజాబ్ న్యూస్ ఛానెల్ తో మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ లాధర్ మాట్లాడుతూ.. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులే స్వయంగా నిరసన తెలిపారు. పోీలీసు వాహనాల్లో రైతులు, నిరసన కారులు ఉన్నారు. ఆయన భద్రతను బెదిరింపునకు గురిచేశారు. దానిని నేనే సాక్షిని అని అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. దీనిని ఓ నెటిజన్ ట్విట్ చేస్తూ.. కుటిల రాజకీయాలతోనే PM modi అడ్డుకున్నారనీ, ఇది ప్రణాళికబద్దమైన రాజకీయ కుట్ర అంటూ ఆరోపించారు.
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణజీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యాలు లేవన్నారు. బీజేపీ నాయకులు కావాలనే తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ప్రధాని మోడీ రోడ్డుమార్గంలో వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం వల్లే ఇది జరిగిందన్నారు. భద్రతను సాకుగా చూపి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని చన్నీ ఆరోపించారు.
కాగా, దేశంలో ఏడాది ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో పంజాబ్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ పంజాబ్లో పర్యటిస్తుండగా, రైతు చట్టాల రద్దు తర్వాత పర్యటించడం ఇదే మొదటిసారి. షెడ్యూల్ ప్రకారం ప్రధాని ఫిరోజ్పూర్లో జరిగే ర్యాలీలో పాల్గొనాల్సి ఉండగా, దీనికి ముందు సభా వేదికకు దారితీసే మూడు అప్రోచ్ రోడ్డులను కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంసీసీ) దిగ్బంధించింది. రైతుల డిమాండ్లపై జనవరి 15న చర్చిస్తారనే హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళన విరమించినట్టు సమాచారం. ఇదిలావుండగా, PM modi కాన్వాయ్ ని అడ్డుకోవడంపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా పంజాబ్ అధికార పార్టీ కాంగ్రెస్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదనే భయంతోనే పంజాబ్ కాంగ్రెస్.. PM modi పర్యటనకు అన్ని విధాలుగా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసిందని జేపీ నడ్డా ఆరోపించారు.