PM Modi France visit: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫ్రెంచ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ థియరీ బుర్ఖార్డ్ ల‌తో క‌లిసి శుక్రవారం పారిస్ లో బాస్టిల్ డే సైనిక పరేడ్ కు ప్రధాని నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పారిస్ వెళ్లిన ప్రధాని మోడీ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ లో యూపీఐని ప్రవేశపెట్టారు. 

PM Modi attends Bastille Day celebrations in Paris: రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పారిస్ లో జరిగిన ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం లేదా బాస్టిల్ డే, 1789 లో ఫ్రెంచ్ విప్లవం సమయంలో బాస్టిల్ జైలును ముట్టడించినందుకు గుర్తుగా ఫ్రెంచ్ చైతన్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. బాస్టిల్ డే పరేడ్ ఈ వేడుకల్లో హైలైట్ గా నిలుస్తుంది. 269 మందితో కూడిన భారత త్రివిధ దళాల బృందం పరేడ్ లో పాల్గొంటుంది. ఫ్రెంచ్ జెట్లతో పాటు భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ యుద్ధ విమానాలు కూడా ఈ సందర్భంగా ఫ్లైపాస్ట్ లో చేరనున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
Scroll to load tweet…

Scroll to load tweet…

కాగా, రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ పారిస్ చేరుకున్నారు. జూలై 14వ తేదీ శుక్రవారం బాస్టిల్ డే పరేడ్ కు గౌరవ అతిథిగా హాజరై తన రోజును ప్రారంభించారు. ఈ పరేడ్ లో భారత ఆర్మీ బృందం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా పాలుపంచుకున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు బ్రౌన్ పివెట్ ఇచ్చే విందులో మోడీ పాల్గొంటారు. ఇది ముగిసిన త‌ర్వాత సాయంత్రం 6.15 గంటలకు పలువురు నేతలతో సమావేశమవుతారు. రాత్రి 8.30 గంటలకు ఎలిసీ ప్యాలెస్ లో జరిగే రిసెప్షన్ కు ప్రధాని హాజరవుతారనీ, ఆ తర్వాత ప్రతినిధుల స్థాయి చర్చలు, పత్రికా ప్రకటన వెలువడుతాయని తెలిపారు.

రాత్రి 10.30 గంటలకు భారత్-ఫ్రాన్స్ సీఈఓ ఫోరంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆ తర్వాత అర్ధరాత్రి లౌవ్రే మ్యూజియాన్ని సందర్శిస్తారు, అక్కడ బాంక్వెట్ విందులో పాల్గొంటారు. అనంతరం ఈఫిల్ టవర్ వద్ద బాణాసంచా ప్రదర్శనను ప్రధాని మోడీ, అధ్యక్షుడు మాక్రాన్ వీక్షిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు.