మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళులు..
మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆ నాయకులకు నివాళి అర్పించారు. ఆదివారం రాజ్ ఘట్ ను, విజయ్ ఘట్ ను ఆయన సందర్శించారు.
మహాత్మాగాంధీకి, లాల్ బహుదూర్ శాస్త్రికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నివాళి అర్పించారు. ఢిల్లీలో ఉన్న రాజ్ ఘాట్, విజయ్ ఘాట్ లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని కోరారు.
భారత రెండో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని గుర్తు చేసుకుంటూ.. ఆయన సరళత, నిర్ణయాత్మకత దేశం మొత్తం ప్రశంసలు అందుకుందని అన్నారు. గాంధీకి నివాళి అర్పించిన ఫొటోలను మోడీ ట్వీట్ చేస్తూ.. ‘‘ గాంధీ జయంతి నాడు మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తున్నాను. ఈ గాంధీ జయంతి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను గుర్తించింది. మనం ఎప్పుడూ బాపు ఆశయాలను పాటిద్దాం. నేను కూడా మీ అందరినీ కోరుతున్నాను. గాంధీజీకి నివాళిగా ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేయాలి.’’ అని ట్వీట్ చేశారు.
శాస్త్రికి నివాళులర్పిస్తూ..‘‘ లాల్ బహదూర్ శాస్త్రి జీ సరళత్వం, నిర్ణయాత్మకత ను దేశం మొత్తం మెచ్చుకుంటుంది. మన దేశ చరిత్రలో చాలా కీలకమైన సమయంలో ఆయన కఠినమైన నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు.’’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ'లోని గ్యాలరీలో ఉన్న కొన్ని సంగ్రహావలోకనాలను కూడా ప్రధాని పంచుకున్నారు. గతంలో వేర్వేరు సందర్భాలలో ఇద్దరు గొప్ప నాయకులకు నివాళులర్పించిన ఆడియో క్లిప్లను కూడా మోడీ పోస్ట్ చేశారు.