రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్దరించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఆశోక్ పాండే అనే న్యాయవాది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్దరించడాన్ని సుప్రీంకోర్టులో న్యాయవాది ఆశోక్ పాండే సవాల్ చేశారు.ఈ మేరకు మంగళవారంనాడు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దొంగలందరి ఇంటి పేరు మోడీ అని ఎలా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ కు చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరువు నష్టం దావా దాఖలు చేశారు.
ఈ విషయమై విచారణ నిర్వహించిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై వేటేసింది. ఈ తీర్పుపై గుజరాత్ హైకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించారు. అయితే రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో కూడ ఊరట దక్కలేదు.రాహుల్ గాంధీ పిటిషన్ ను ఈ ఏడాది జూలై 7న కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టులో ఈ ఏడాది జూలై 15న రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది సుప్రీంకోర్టు. అన్ని వర్గాల వాదనలను విన్నది.ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించారు స్పీకర్ ఓం బిర్లా. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించారు స్పీకర్ ఓం బిర్లా.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించడాన్ని యూపీకి చెందిన న్యాయవాది ఆశోక్ పాండే ఇవాళ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించడాన్ని రాజ్యాంగ విరుద్దమని ఆశోక్ పాండే పేర్కొన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.ఒకసారి లోక్ సభ సభ్యత్వం కోల్పోయిన తర్వాత తిరిగి లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించడం సరైంది కాదని పాండే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో అభిప్రాయపడ్డారు.
