దేశం బయటి నుండి కూడా నిషేధిత సంస్థ పీఎఫ్ఐ భారీ నిధులు అందుతున్నాయని ఈడి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షుడు ఎం.కె ఫైజీ విచారణ కీలకంగా మారింది.
MK Faizy Arrest : నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షుడు ఎం కె ఫైజీ విచారణ కొనసాగుతోంది. గత సోమవారమే ఫైజీని అరెస్ట్ చేసిన ఈడి న్యాయస్థానంలో హాజరుపర్చగా ఆరు రోజుల కస్టడీకి అప్పగించింది. దీంతో పిఎఫ్ఐ తో ఎస్డిపిఐ ఆర్థిక లావాదేవీల గురించి ఫైజీని విచారిస్తోంది ఈడి.
విదేశాల నుండి పీఎఫ్ఐకి అందిన డబ్బు గురించిన మరిన్ని వివరాలు సేకరించడానికి ఫైజీని విచారిస్తోంది ఈడి. ఎస్డిపిఐ ఆర్థిక లావాదేవీలను పీఎఫ్ఐ నియంత్రిస్తోందని ఇప్పటికే ఈడి ఆరోపిస్తోంది. ఎస్డిపిఐకి ఎన్నికల నిధులను పాపులర్ ఫ్రంట్ నుండే అందుతున్నాయని ఈడీ చెబుతోంది. చివరకు ఎన్నికల్లో పోటీచేసే ఎస్డిపిఐ అభ్యర్థులను కూడా పీఎఫ్ఐ నిర్ణయిస్తోందని ఈడి అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఎస్డిపిఐ అంతర్గతంగా ఒక ఇస్లామిక్ సంస్థ కాగా బయటకు మాత్రం సామాజిక సంస్థగా చెలామణి అవుతోందని ఈడి పేర్కొంది. తమ తనిఖీలలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఎస్డిపిఐ కి పిఎఫ్ఐ ఇచ్చినట్లు ఆధారాలు లభించాయన్నారు. గల్ఫ్ నుండి కూడా చట్టవిరుద్ధంగా డబ్బులు ఈ సంస్థలకు చేరినట్లు... వీటిని దేశంలో దాడులు, ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి ఉపయోగిస్తున్నారని ఈడి ఆరోపిస్తోంది. గల్ఫ్ దేశాల నుండి రంజాన్ వసూళ్ల పేరుతో కూడా డబ్బు వసూలు చేశారని ఈడీ అంటోంది.
ఎస్డిపిఐ, పీఎఫ్ఐ రెండు ఒక్కటే : ఈడి
ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షుడు ఎం కె ఫైసీ అరెస్టుకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఈడీ తీవ్రమైన విషయాలను వెల్లడించింది. ఎస్డిపిఐ, పీఎఫ్ఐ రెండు ఒకటేనని ఈడీ తెలిపింది. ఎస్డిపిఐ ఆర్థిక లావాదేవీలను పీఎఫ్ఐ నియంత్రిస్తోందన్నారు... గల్ఫ్ నుండి కూడా చట్టవిరుద్ధంగా డబ్బు సేకరిస్తున్నారని... వీటిని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తోంది,
ఎంకె ఫైజీకి తెలిసే ఎస్డిపిఐ,పిఎఫ్ఐ ల ఆర్ధిక లావాదేవీలు జరిగాయని... హవాలా వంటి మార్గాల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు డబ్బు చేరిందన్నారు. 12 సార్లు నోటీసులు ఇచ్చినా ఫైజీ విచారణకు హాజరు కాలేదు... అందువల్లే ఇతర చర్యలు ప్రారంభించామని ఈడీ స్పష్టం చేసింది. పీఎఫ్ఐకి సంబంధించిన కేసులో ఇప్పటివరకు 61.72 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించినట్లు ఈడీ తెలిపింది.