రానున్న రోజుల్లో  భారత ప్రజల తలసరి ఆదాయం ఏడు రెట్లు పెరిగే అవకాశం ఉందని  ఎస్‌బీఐ నివేదిక తెలిపింది


న్యూఢిల్లీ: భారత దేశ తలసరి ఆదాయం ఏడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్‌బీఐ తన నివేదికలో తెలిపింది. 2047 నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో ప్రధాని మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే.ప్రపంచ మార్కెట్ లో ఇండియా స్థానం మెరుగైన స్థితికి చేరుకుంటుందని ఎస్ బీ ఐ నివేదిక తెలిపింది. 2047 నాటికి దేశ తలసరి ఆదాయం ఏడు రెట్లు పెరుగుతుందని ఈ నివేదిక తేల్చి చెప్పింది. దేశ ప్రజల తలసరి ఆదాయం రూ. 2 లక్షల నుండి రూ. 14.9 లక్షలకు చేరుకుంటుందని ఎస్‌బీఐ వివరించింది.

భారత దేశ తలసరి వార్షిక ఆదాయం ప్రస్తుతం దిగువ మధ్య ఆదాయ దేశాల కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో ఆదాయపన్ను చెల్లించే వారి సంఖ్య కూడ పెరగనుందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం పన్ను చెల్లింపు దారుల సంఖ్య ఏడు కోట్లుంటే 2047 నాటికి ఈ సంఖ్య 48.2 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక వివరించింది. బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి ఆదాయ పన్ను చెల్లింపులు ఎక్కువగా ఉన్నట్టుగా నివేదిక వెల్లడించింది. ఐటీ పన్నుల్లో ఈ రాష్ట్రాల నుండే అత్యధికంగా వచ్చినట్టుగా ఈ నివేదిక తెలిపింది. చిన్న రాష్ట్రాల నుండి ఆదాయ పన్ను చెల్లింపులు గత 9 ఏళ్ల కాలంలో 20 శాతం పెరిగినట్టుగా ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది.