పార్లమెంట్ ఉభయ సభలు  బుధవారంనాడు ఉదయం 11 గంటలకు  ప్రారంభమయ్యాయి.  విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు  కొనసాగాయి.

న్యూఢిల్లీ:పార్లమెంట్ ఉభయ సభలు బుధవారంనాడు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్ సభ ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై తమ తమ స్థానాల్లో నిలబడి విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ప్ల కార్డులు ప్రదర్శించి ఆందోళన నిర్వహించారు. లోక్ సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలను స్పీకర్ ఓం బిర్లా చేపట్టారు. అయితే మణిపూర్ అంశంపై విపక్షాలు సభలో నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

అయితే విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో లోక్ సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మైక్ ఆపివేశారని విపక్షపార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. అయితే తాను మైక్ ఆపలేదని రాజ్యసభ వైఎస్ చైర్మెన్ జగదీప్ ధంకర్ ప్రకటించారు. ఈ విషయమై రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

మరోవైపు రాజ్యసభ కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్ మంగళవారంనాడు తన చాంబర్ లో పలు పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించిన తర్వాత పలు పార్టీలకు చెందిన నేతలతో జగదీప్ ధంకర్ సమావేశం కావడం ఇది రెండోసారి.