మహ్మద్ సిరాజ్ పేస్కు పాకిస్తానీ యాంకర్ ఫిదా
భారత పేసర్ మహ్మద్ సిరాజ్కు దేశ సరిహద్దులు దాటి అభిమానాలు పుట్టుకొస్తున్నారు. తాజాగా పాకిస్తానీ యాంకర్ జైనాబ్ అబ్బాస్.. మహ్మద్ సిరాజ్ ప్రదర్శనపై మనసుపారేసుకున్నారు. తాజాగా, ఆయన పేసర్ అద్భుతమని కితాబిచ్చారు.
న్యూఢిల్లీ: లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో అద్భుత ఆటతీరు ప్రదర్శించిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్ అందరి మన్ననలు పొందుతున్నారు. అనతికాలంలోనే సిరాజ్కు దేశ సరిహద్దుకు ఆవల కూడా అభిమానం పెరుగుతున్నది. తాజాగా, పాకిస్తాన్కు చెందిన స్టార్ స్పోర్ట్స్ యాంకర్, జర్నలిస్టు జైనాబ్ అబ్బాస్ కూడా ఈ జాబితాలో చేరారు.
‘మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ శ్రేణి బౌలర్గా రాణిస్తున్నారు. గతేడాది ఆస్ట్రేలియా టూర్లో, అలాగే, తాజా లార్డ్స్లో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఆయన వికెట్లు కొల్లగొట్టిన వైనం అద్భుతం. మంచి స్పీడ్తో బాల్ వేస్తున్న సిరాజ్ బంతిని తన అదుపులో ఉంచుకోవడంలో దిట్ట. ఆయన లైన్ అండ్ లెంగ్త్ అమేజింగ్’ అని జైనాబ్ అబ్బాస్ పొగడ్తలు కురిపించారు.
టీమిండియాపైనా ప్రశంసలు గుమ్మరించారు. ఇంగ్లాండ్పై పట్టుసడలకుండా భారత్ ప్రదర్శన కనబరిచిందని జైనాబ్ అన్నారు. టీమిండియాలో పోరాడాలనే పట్టుదల కట్టిపడేస్తుందని వివరించారు. ఈ టీమ్ ఓటమిని ఎప్పడూ అంగీకరించదని కితాబిచ్చారు. ఈ ప్రగాఢ విశ్వాసమే జట్టు గెలుపునకు దోహదపడుతుందని చెప్పారు.
అనతికాలంలోనే సిరాజ్ తన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లోనూ గణనీయమైన పురోగతి సాధించారు. బుధవారం విడుదలైన ఈ ర్యాంకింగ్స్లో సిరాజ్ 18 స్థానాలు మెరుగుపరిచి 38వ స్థానానికి చేరుకున్నారు. ఇంగ్లాండ్తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ ఆయన నాలుగు వికెట్ల చొప్పున తన ఖాతాలో వేసుకున్నారు. ఈ టెస్టులో భారత విజయానికి మార్గాన్ని సుగమం చేసి మనసులు దోచుకున్నారు.