ఒడిశా రైలు ప్రమాదంలో 278 మరణించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 40 మంది కరెంట్ షాక్తో మరణించి ఉండొచ్చని రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న అధికారి తెలిపారు. ఈ ఘటనపై దాఖలైన ఎఫ్ఐఆర్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Odisha Train Tragedy: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు రైళ్లు ఢీకొట్టుకున్న ప్రమాదంలో సుమారు 280 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 40 మంది కరెంట్ షాక్తో మరణించినట్టు తెలుస్తున్నది. పోలీసు అధికారులు ఇదే విషయాన్ని వ్యక్తపరిచారు.
భీకర రైలు ప్రమాదంలో బోగీలు చెల్లాచెదురుగా పడిన సంగతి తెలిసిందే. ఈ కోచ్ల నుంచి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. బోగీలు ఢీకొట్టుకోవడంతో కొందరు వాటి మధ్య ఇరుక్కున్నారు. అందుకే కొన్ని మృతదేహాలు ఛిద్రమై కనిపించాయి. ఇదిలా ఉండగా కనీసం 40 మృతదేహాలు ఎలాంటి గాయాల ఆనవాళ్లు లేకుండా కనిపించాయని రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
రైలు ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, ఫలితంగా దానికి సమీపంలో ఉన్న వారు విద్యుద్ఘాతానికి గురై మరణించొచ్చని ఆ అధికారి తెలిపారు. ఇదే అంశాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లోనూ పేర్కొన్నారు.
Also Read: రాజస్తాన్లో కాంగ్రెస్కు భారీ షాక్.. జూన్ 11న సచిన్ పైలట్ కొత్త పార్టీ!
ఒడిశాలోని బాలసోర్లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడుస్తున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. అలాగే ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 200 మంది చికిత్స పొందుతున్నారని తూర్పు మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు.
‘‘రైలు ప్రమాదంలో 1,100 మంది గాయపడ్డారు. వారిలో 900 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో సుమారు 200 మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మరణించిన 278 మందిలో 101 మృతదేహాలు ఇంకా గుర్తించాల్సి ఉంది’’ అని రింకేష్ రాయ్ తెలిపారు.