బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాల్లో ఐక్యత అవసరం - బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్
ప్రతిపక్ష పార్టీలు అన్ని ఐక్యంగా ఉంటేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించవచ్చని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది మంచి పరిణామం అని అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాల్లో ఐక్యత ముఖ్యం అని ఆర్జేడీ నాయకుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన పర్యటన ప్రతిపక్ష నాయకుల ఏకీకరణే లక్ష్యంగా సాగింది. ‘‘ ఇది మంచి విషయం. మనమందరం ఐక్యంగా ఉంటే (బీజేపీని ఓడించడంలో) విజయం సాధిస్తామని స్పష్టం అవుతోంది’’ అని తేజస్వీ యాదవ్ శుక్రవారం పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
నితీష్ కుమార్ చేసిన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నాయకులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులతో సమావేశమయ్యారు.
గురువారం బీహార్ చేరుకున్న ఆయన లాలు ప్రసాద్ యాదవ్ నివాసానికి చేరుకొని ఆయన తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలను ఏకం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని, ఆ ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు త్వరలో ఐక్యమవుతారని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతీ ఒక్కరూ దోహదపడతారని తాను గట్టిగా నమ్ముతున్నానని తెలిపారు. రెండు మూడు నెలల్లో ప్రధాని అభ్యర్థిపై తుది నిర్ణయం వెలువడుతుందని అన్నారు. ప్రస్తుతానికి అయితే తాను ప్రతిపక్ష పార్టీల ప్రధాని అభ్యర్థిని కాదని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
గణేశ్ నిమజ్జనం చేస్తుండగా దుర్ఘటన.. నీటిలో మునిగి ఏడుగురు దుర్మరణం.. సీఎం సంతాపం
తనకు ప్రధాని కావాలనే ఆసక్తి, కోరిక లేదని పదే పదే నొక్కి చెప్పిన నితీష్ కుమార్.. ప్రతిపక్షాలు ఏకమైతే మంచి వాతావరణం నెలకొంటుందని అన్నారు. ‘నాకు ప్రధాని కావాలనే కోరిక, ఆకాంక్షలు లేవు’ అని బీహార్ సీఎం ఢిల్లీలో మీడియాతో చెప్పారు. బీజేపీ గత విధానాలకు దూరమైందని, పూర్తిగా మారిపోయిందని కుమార్ ఆరోపించారు. ‘‘ బీజేపీ ఇప్పుడు మారిన పార్టీ. ఇది అటల్ జీ కాలంలో ఉన్న బీజేపీ కాదు. బీజేపీ విధానాలు, కథనాలు ఇప్పుడు మారాయి ’’ అని బీహార్ సీఎం పేర్కొన్నారు. తన పై విమర్శలు చేసిన వారిపై మండిపడిన నితీష్ కుమార్.. తమ పార్టీ, ప్రభుత్వం అభివృద్ధి పనులును చేపట్టడాన్ని విశ్వసిస్తుందని అన్నారు.
పాకిస్తాన్కు అమెరికా నుంచి ఫైటర్ జెట్ ఎక్విప్మెంట్లు.. ‘సహాయం కాదు.. విక్రయమే’
కాగా.. బీహార్ లో బీజేపీతో సంబంధాలను తెంచుకుని, ఆర్జేడీ, కాంగ్రెస్ లతో చేతులు కలిపిన తరువాత నితీష్ కుమార్ చేసిన మొదటి ఢిల్లీ టూర్ ఇది. గత నెల ప్రారంభంలో నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో సంబంధాలు తెంచుకున్నారు. ఆర్జేడీ, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వంలో కూడా జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా.. ఈ పరిణామాల పట్ల బీజేపీ తీవ్రంగా మండిపడింది. జేడీ(యూ) నాయకుడు ఆర్జేడీతో చేతులు కలపడం వల్ల బీహార్ ను అరాచకం, అవినీతి యుగంలోకి నెట్టారని ఆ పార్టీ ఆరోపించింది. అయితే నితీష్ కుమార్ తీసుకున్న పరిణామం పట్ల ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి.