మన దేశంలో మహిళా న్యాయవాదులు సుమారు 15.3 శాతం అని పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. ఈ సమాచారం ఆయా హైకోర్టుల బార్ అసోసియేషన్లు పంపిన సమాచారం మేరకు రూపొందించింది. ఢిల్లీ సహా 9 హైకోర్టుల నుంచి సమాచారం రాలేదు.
న్యూఢిల్లీ: మన దేశంలో మహిళా న్యాయవాదులుగా ఎంత మంది ఎన్రోల్ అయ్యారనే వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పార్లమెంటులో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాలను శుక్రవారం వెల్లడించింది. మన దేశంలో కేవలం 15.3 వాతం మంది మాత్రమే మహిళా న్యాయవాదులు ఉన్నారని తెలిపింది.
కాగా, ఢిల్లీ, అసోం, బిహార్, ఛత్తీస్గడ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్, త్రిపురల్లో మహిళా న్యాయవాదులకు సంబంధించిన వివరాలు ప్రత్యేకంగా పొందుపరచలేదు.
ఈ వివరాలు కూడా 24 రాష్ట్రాల బార్ అసోసియేషన్ల నుంచి సమాచారం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. లీగల్ ప్రొఫెషన్లో మహిళలు ఎంత మంది ఉన్నారు? ఈ వృత్తి నుంచి ఎందుకు మహళలు తరలివెళ్లిపోతున్నారో కారణాలు చెప్పాలని ఎంపీ జయదేవ్ గల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల నుంచి మహిళా, పురుష న్యాయవాదుల వివరాల పంపాలని ఆదేశించింది. ఈ బార్ అసోసియేషన్లు అందించిన సమాచారం మేరకు మన దేశంలో 15.3 శాతం మంది మహిళలు మాత్రమే న్యాయవాద వృత్తిలో ఉన్నారు.
ఈ జాబితాలో మేఘాలయా టాప్లో ఉన్నది. మేఘాలయాలో 59.3 శాతం మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. కాగా, మహిళా న్యాయవాదులు కనిష్టంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో మొత్తం సుమారు నాలుగు లక్షల మంది న్యాయవాదులు ఉంటే.. 8.7 శాతం మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. కాగా, ఢిల్లీ సహా 9 హైకోర్టుల వివరాలు అందలేదు.
బిహార్లో 1.2 లక్షల మంది న్యాయవాద వృత్తిలో ఎన్రోల్ అయ్యారు. కానీ, అందులో ఎంత మంది మహిళలు అనే విషయం తెలియదు.
ఈ సమాచారం అంతా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారమేనని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే, మహిళలు ఎందుకు ఈ వృత్తిని వదిలిపెడుతున్నారనే విషయంపై అధ్యయనం చేయలేదని వివరించారు.
