ఏడాదిన్నర పాపపై కామాంధుడి అత్యాచారం: చిన్నారి మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. ఏడాదిన్నర వయస్సు గల పాపను ఓ కామాంధుడు ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. పాప మరణించింది.
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు అత్యంత నీచ కార్యానికి ఒడిగట్టాడు. ఏడాదిన్నర వయస్సు గల పాపపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి మరణించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రాయిచ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది.
ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఏడాదిన్నర వయస్సు గల పాపను సోమవారం రాత్రి 30 ఏళ్ల వయస్సు గల నిందితుడు ఆమెను ఎత్తుకెళ్లాడు. దగ్గరలో ఉన్న ఓ నిర్మానుష్యమైన పాఠశాల భవనంలోకి తీసుకుని వెళ్లి పాపపై అత్యాచారం చేసాడు. మంగళవారం ఉదయం నిద్ర లేచిన తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో గ్రామస్థులతో కలిసి గాలింపు చేపట్టారు.
చివరకు పాఠశాలలో స్పృహ తప్పి పడి ఉన్న పాప కనిపించింది. తీవ్రమైన రక్తస్రావం కావడంతో ఆమె స్పృహ తప్పింది. అక్కడే ఉన్న నిందితుడిని పట్టుకుని గ్రామస్థులు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పాపను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకుని వెళ్తుండగా నిందితుడు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. లొంగిపోవాలని హెచ్చరినా వినకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిందితుడి కాలికి గాయమైంది. అతన్ని అదుపుోలకి తీసుకుని వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరు పరిచారు.