దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరుగుతోన్న వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. ఈ నెల 10న ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల సీఎస్లు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరుగుతుండటం పట్ల జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. వాయు కాలుష్యం నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 10న ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల సీఎస్లు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ.... ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.
ఇకపోతే... ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. రెండో రోజూ తీవ్రమైన కేటగిరీలోనే ఉన్నది. ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్లు పక్కపక్కనే కూర్చుని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాయు కాలుష్యం అనేది దేశవ్యాప్తంగా కనిపిస్తున్న సమస్య, ముఖ్యంగా ఉత్తర భారతంలో చాలా చోట్ల ఇది ఎక్కువగా ఉన్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు విలేకరుల సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీని నియంత్రణకు పూనుకోవాలని వివరించారు. అలాగే, పంజాబ్లో పంట వ్యర్థాల దహనంపై బాధ్యత తీసుకుంటామని, త్వరలోనే దాన్ని కట్టడి చేస్తామని చెప్పారు.
ALso REad:పంట వ్యర్థాల దహనంపై బాధ్యత తీసుకుంటాం: ఢిల్లీ, పంజాబ్ సీఎంల ప్రకటన
ఢిల్లీలో, పంజాబ్లోనూ తమ ప్రభుత్వాలే ఉన్నాయని వివరించారు. పంజాబ్లో తమ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలలు మాత్రమే గడిచిందని భగవంత్ సింగ్ మాన్ అన్నారు. అందులో కొన్ని నెలలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు చేయడానికే సరిపోయాయని వివరించారు. కాబట్టి, ఈ సమస్యను తీర్చడానికి తమకు మరో ఏడాది కాలం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే పంట వ్యర్థాలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాటి ఫలితాలు రావడానికి మరికొంత కాలం ఆగాలని, వచ్చే ఏడాది నవంబర్ కల్లా వీటి ఫలాలు కనిపిస్తాయని వివరించారు. తాము ఈ సమస్యను బాధ్యత తీసుకుంటున్నామని, దీని నుంచి పారిపోవడం లేదని మాన్ తెలిపారు. వంద శాతం బాధ్యత తీసుకుంటామని అన్నారు.
రైతుల పంట పెరిగిందని, కాబట్టి, పంట వ్యర్థాలూ పెరిగాయని, ఫలితంగా కాల్చడం కూడా పెరిగి కాలుష్యం హెచ్చడానికి కారణమైందని వివరించారు. వచ్చే ఏడాది రైతులను వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. అలాగే, ఢిల్లీలోనూ వాయు కాలుష్యం తీవ్రతరం కావడానికి కేవలం కేజ్రీవాల్ ప్రభుత్వమే కారణం కాదని అన్నారు.
