మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా పోలీసులకు చిక్కాడు. ఇది మావోయిస్టులకు మరో చావుదెబ్బ అని చెప్పాలి.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో మావోయిస్టు అగ్రనేత పోలీసులకు చిక్కాడు. ఒడిశా కొరాపుట్ జిల్లాలోని పెటగూడా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాను అరెస్టు చేశాయి. ఇతడి తలపై ఒడిశాలో రూ.4 లక్షల బహుమతి ఉండగా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.8 లక్షల బహుమతి ప్రకటించింది. ఇలా మొత్తంగా అతడి తలపై రూ.12 లక్షల బహుమతి ఉంది.
బోయిపారిగూడ పోలీస్ స్టేషర్ పరిధిలోని పెట్ గూడ గ్రామ సమీపంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టు శిబిరాన్ని చుట్టుముట్టిన బలగాలు కీలక నేత హిడ్మాను గుర్తించారు. మావోలు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయే ప్రయత్నంచేయగా పోలీసులు దీటుగా ఎదుర్కొన్నారు... కుంజం హిడ్మా పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటపడి పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలు భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటిలో ఒక ఏకే-47 రైఫిల్, మొత్తం 47 తుపాకులు, 35 లైవ్ రౌండ్లు, 1 మ్యాగజైన్, 27 డిటొనేటర్లు, 90 వైర్లెస్ డిటొనేటర్లు, 2 కిలోల గన్పౌడర్, 2 స్టీల్ టిఫిన్ బాక్సులు, 2 రేడియోలు, 2 ఇయర్ఫోన్లు, ఒక వాకీటాకీ, 2 కత్తులు, 4 టార్చ్లైట్లు, మావోయిస్టు లిటరేచర్, మందులు, దుస్తులు ఉన్నాయి.
హిడ్మా ప్రస్తుతం నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) ఏరియా కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల చత్తీస్ ఘడ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మరణాన్ని మరిచిపోకముందే హిడ్మా పట్టుబడటం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. ఈ పరిణామాలను చూస్తుంటే మావోయిస్టుల ఏరివేతలో బలగాలు విజయవంతం అవుతున్నాయనే చెప్పాలి.
పోలీసుల ప్రకారం, హిడ్మా అరెస్టు మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించే దిశగా కీలక మైలురాయిగా భావిస్తున్నారు. మిగిలిన మావోయిస్టు నెట్వర్క్లను చెదరగొట్టేందుకు విచారణ కొనసాగుతోంది. భవిష్యత్లో ఈ అరెస్టు ఆధారంగా మరిన్ని ఆపరేషన్లు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.