బెంగాల్ లో తెలుగుకు అధికార భాష హోదా..!
‘మినీ ఆంధ్రా’ గా పేరొందిన ఖరగ్ పూర్ లోని తెలుగువారిని ఆకర్షించి.. వారి ఓట్లను పొందేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నారంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో తెలుగుకు అధికార భాష హోదా ఇస్తూ మమతా బెనర్జీ సర్కరు కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తెలుగువారిని తమ రాష్ట్రంలో భాషాపరమైన మైనార్టీలుగా గుర్తింపు ఇచ్చారు. అయితే... దీదీ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. త్వరలో బెంగాల్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇది కూడా ఎన్నికల స్టంట్ అంటూ ఆరోపిస్తున్నారు.
‘మినీ ఆంధ్రా’ గా పేరొందిన ఖరగ్ పూర్ లోని తెలుగువారిని ఆకర్షించి.. వారి ఓట్లను పొందేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నారంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషి స్తున్నారు. ఖరగ్పూర్ మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో ఆరింట తెలుగువాళ్లే కౌన్సిలర్లు. వివిధ పార్టీల్లో మనవాళ్లు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు. తెలుగుకు అధికార భాష హోదా ఇవ్వాలని అక్కడి ప్రజలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్ నిర్ణయాన్ని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు. బెంగాల్లో హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదా ఉంది.