Asianet News TeluguAsianet News Telugu

ఒడిషా రైలు ప్రమాదం : బాలాసోర్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మోడీ

ఒడిషా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం బాలాసోర్‌లోని ఫకీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించి, ధైర్యం చెప్పారు. 
 

odisha train accident : PM Narendra Modi meet survivors in balasore hospital ksp
Author
First Published Jun 3, 2023, 5:24 PM IST

ఒడిషాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సహాయక కార్యక్రమాలు, మరమ్మత్తులు తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనాస్థలిలోనే కేంద్ర మంత్రులు, అధికారులతో ప్రధాని రివ్యూ చేశారు. తర్వాత హెలికాఫ్టర్‌లో బాలసోర్‌కు చేరుకున్న ప్రధాని అక్కడి ఫకీర్ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు. 

అయితే ఈ ప్రమాదంపై రైల్వే అధికారుల బృందం ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'సిగ్నలింగ్ వైఫల్యం' కారణంగా ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని నిపుణుల బృందం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టి పట్టాలు తప్పిందని నిపుణులు బృందం తెలిపింది. ‘‘12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ కోసం అప్ మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇవ్వబడింది.  ఆ తర్వాత ఆపివేయబడింది. ఈ క్రమంలోనే రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి.. అప్ లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుతో ఢీకొని పట్టాలు తప్పింది’’ నిపుణుల నివేదిక పేర్కొంది. 

ALso Read: ఒడిషాలో రైలు ప్రమాదస్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ... అక్కడికక్కడే అధికారులతో రివ్యూ

‘‘అదే సమయంలో రైలు నంబర్ 12864 (యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్) డౌన్ మెయిన్ లైన్ గుండా వెళ్లింది. దానిలోని రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. బోల్తా పడ్డాయి’’ అని నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక పేర్కొంది. అయితే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ సిగ్నల్ ఇచ్చి ఎందుకు టేకాఫ్ చేశారన్నది మాత్రం నిపుణుల బృందం ప్రాథమిక నివేదికలో స్పష్టం చేయలేదు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు సమగ్ర దర్యాప్తులో మాత్రమే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

అంతకుముందు ఒడిశాలో రైలు ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల గురించి ఆరా తీసిన అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెద్ద విషాదకరమైన ప్రమాదం. రైల్వే, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నాయి. సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించబడతాయి. ఈ ప్రమాదంపై వివరణాత్మక ఉన్నత స్థాయి విచారణ నిర్వహించబడుతుంది. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారు’’ అని చెప్పారు
 

Follow Us:
Download App:
  • android
  • ios