ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం‌ దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని  నరేంద్ర మోదీ కూడా ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలను సమీక్షించారు.

ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం‌లో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని  నరేంద్ర మోదీ కూడా ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలను సమీక్షించారు. రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. తాజాగా.. ప్రమాద స్థలంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించాల్సిందిగా సూచించినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ప్రమాద స్థలంలో ట్రాక్ పునరుద్దరణ పనులకు సంబంధింన వివరాలను అశ్విని వైష్ణవ్‌ను మోదీ అడిగి తెలుసుకున్నారు. ట్రాక్ మరమత్తు పనులు త్వరగా అయ్యేలా చూడాలని సూచించారు. ఇక, ఒడిశాలోని బాలాసోర్‌లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ ఈరోజు తెల్లవారుజామున చెప్పారు. శనివారం ఉదయం నుంచి అశ్విని  వైష్ణవ్ ప్రమాద స్థలంలోనే ఉన్నారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలు, పునరుద్దరణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

ఇక, ఒడిశాలోని బాలాసోర్‌లో ప్రమాద స్థలానికి ప్రధాని మోదీ శనివారం స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ ఆసుపత్రిని ప్రధాని మోదీ సందర్శించారు. రైలు ప్రమాదంలో గాయపడి అక్కడ చికిత్స పొందుతున్నవారిని మోదీ పరామర్శించారు. ‘‘ఒడిశాలో విషాదం జరిగిన ప్రదేశంలో పరిస్థితిని సమీక్షించాను. నా తీవ్ర దుఃఖాన్ని వ్యక్తపరిచేందుకు పదాలు సరిపోవు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రమాద స్థలంలో పని చేస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే, ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, దోషులుగా తేలిన వారిని విడిచిపెట్టబోమని చెప్పారు. ‘‘ఇది బాధాకరమైన సంఘటన. ప్రమాదంలో కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోవచ్చు కానీ ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలతో కలిసి ఉన్నాం. ప్రభుత్వం ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణించింది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తాం. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులుగా తేలిన వారిని విడిచిపెట్టకుండా చూసేందుకు సూచనలు ఇవ్వబడ్డాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు.