Bhubaneswar: జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 హెచ్3ఎన్2 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనీ, జలుబు, దగ్గుతో బాధపడేవారు ముఖాన్ని గుడ్డ లేదా చేతి రుమాలుతో కప్పుకోవాలని సూచించింది.
Odisha reports 59 H3N2 influenza cases: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయి. ఒడిశాలోనూ హెచ్3ఎన్2 సబ్ వేరియంట్ కు చెందిన ఇన్ ఫ్లూయెంజా కేసులు అధికంగా నమోదవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. 59 హెచ్3ఎన్2 రకం ఇన్ ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఒడిశాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో సేకరించిన 225 నమూనాల్లో 59 మందికి హెచ్ 3ఎన్ 2 ఇన్ ఫ్లూయెంజా సోకినట్లు అధికారులు శనివారం తెలిపారు. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, హెచ్3ఎన్ 2 అనేది మానవులకు కాకుండా జంతువులలో అధికంగా వ్యాపించే ఇన్ ఫ్లూయెంజా రకం వైరస్. ఇది సాధారణంగా పందులలో వ్యాపిస్తుంది. మానవులకు సోకే అవకాశాలు ఉండవు, కానీ, లక్షణాలు కాలానుగుణ ఫ్లూ వైరస్ ల మాదిరిగానే ఉంటాయి. దగ్గు, ముక్కు కారటంతో పాటు జ్వరం, శ్వాసకోశ ఇబ్బంది లక్షణాలు, శరీర నొప్పి, వికారం, వాంతులు లేదా విరేచనాలతో సహా ఇతర లక్షణాలు ఉంటాయి.
ఒడిశాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో సేకరించిన 225 నమూనాల్లో 59 హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా కేసులను గుర్తించినట్లు భువనేశ్వర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ సంఘమిత్ర పాటి తెలిపారు. లక్షణాలు సీజనల్ ఫ్లూ వైరస్ల మాదిరిగానే ఉంటాయనీ, జ్వరం, దగ్గు వంటివి ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం, వైరస్ కు ఖచ్చితమైన చికిత్స అందుబాటులో లేదనీ, ప్రజలు హెచ్3ఎన్2 బారినపడకుండా కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఒడిశా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇన్ ఫ్లూయెంజా వైరస్ కారణంగా భారతదేశం మొదటి రెండు మరణాలను ధృవీకరించినందున హెచ్3ఎన్2 ను నివారించడానికి పర్యవేక్షణ, ముందు జాగ్రత్త చర్యలు పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
కర్ణాటకలో హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న 82 ఏళ్ల హీరే గౌడ సీజనల్ ఇన్ ఫ్లూయెంజా సబ్ టైప్ కారణంగా మార్చి 1న మరణించారు. హర్యానాలో 56 ఏళ్ల ఊపిరితిత్తుల కేన్సర్ రోగి ఇన్ ఫ్లూయెంజా హెచ్3ఎన్2 కారణంగా మృతి చెందారని వైద్యులు గుర్తించారు. జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 హెచ్3ఎన్2 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, జలుబు, దగ్గుతో బాధపడేవారు ముఖాన్ని గుడ్డ లేదా చేతి రుమాలుతో కప్పుకోవాలని సూచించింది.
రాష్ట్రాలకు లేఖ..
హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా కేసుల మధ్య కోవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ ఫ్లూయెంజా లాంటి అనారోగ్యం లేదా తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణ కేసులను గుర్తించడానికి సమగ్ర నిఘా కార్యాచరణ మార్గదర్శకాలను పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అలాగే, ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత, కోవిడ్ -19, ఇన్ ఫ్లూయెంజాకు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ కవరేజ్ వంటి ఆసుపత్రుల సన్నద్ధతను సమీక్షించాలని రాష్ట్రాలను కోరింది. గత కొన్ని నెలలుగా కోవిడ్ -19 వ్యాప్తి గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ -19 టెస్ట్ పాజిటివిటీ రేట్లు క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమనీ, దీనిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
