వాలెంటైన్స్ డే లోపు అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే.. ఒడిశా కాలేజ్ బంపర్ ఆఫర్.. ఫేక్ నోటీస్ వైరల్..
ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ఒక కళాశాల ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవానికి ముందు తప్పనిసరిగా బాయ్ఫ్రెండ్ను కలిగి ఉండాలని కాలేజీ అమ్మాయిలందర్నీ ఆదేశిస్తూ వెలువడిన నకిలీ నోటీసుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒడిశా : ఫిబ్రవరి వస్తుందంటే ప్రేమికుల్లో కొత్త ఉత్సాహం మొగ్గతొడుగుతుంది. వాలంటైన్స్ డే నాడు తాము ఇష్టపడ్డ వ్యక్తులకు ప్రపోజ్ చేయడం.. ఆల్రెడీ ప్రేమలో ఉంటే తమ ప్రేమికులకు సర్ప్రైజ్ గిఫ్ట్ లతో తమ బంధాన్ని మరింత బలపరచుకోవడం.. ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. మరోవైపు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం మన సంస్కృతి కాదంటూ.. నిరసనలు తెలుపుతూ ఆ రోజు కనిపించిన వారికి పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలోని ఓ కాలేజీనుంచి వెలువడిన అధికారిక ప్రకటన అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.
ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14 నాటికి తమ కాలేజీలోని ప్రతి ఒక్క అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కనిపించాలని.. అలా లేకపోతే కాలేజీలోకి అనుమతించమంటూ.. ఓ కాలేజీ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు కాలేజీ పేరుతో, ప్రిన్సిపల్ సంతకంతో వెలువడిన ఒక అధికారిక నోటీసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ నోటీసు విపరీతంగా షేర్ అవుతోంది. విచిత్రంగా ఉన్న ఈ నోటీసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేశారు.
అయితే వీరి దర్యాప్తులో ఈ నోటీసు ఫేక్ అని తేలింది. దీంతో ఫేక్ నోటీసు తయారుచేసి వైరల్ చేసిన నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు ఇలా తెలియజేశారు. ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలో ఎస్వీఎం అటానమస్ అనే కాలేజీ ఉంది. దీని ప్రిన్సిపల్ పేరిట ప్రేమికుల దినోత్సవం నాటికి సంబంధించి ఒక ఫేక్ నోటీసు వెలువడింది. ఈ నోటీసు వైరల్ కావడంతో కాలేజీ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి.
దీంతో ప్రిన్సిపాల్ బిజయ్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సంతకాన్ని దుర్వినియోగం చేశారని ఆ నోటీసు నకిలీదని.. తమ కాలేజీ పరువు తీసేందుకే ఇలా చేశారని.. ఎవరో కుట్ర పన్ని.. కావాలని ఈ ఫేక్ నోటీసు సృష్టించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.