CM Yogi: శ్రీరామ నవమి రోజున ఉత్తరప్రదేశ్ ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోలేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో ప్రజలు శ్రీరామ నవమి, పవిత్ర రంజాన్ మాసం రెండింటినీ శాంతి, గొప్ప ఉత్సాహంతో జరుపుకున్నారని అన్నారు.
Uttar Pradesh: శ్రీరాముడి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శ్రీరామ నవమి (Ram Navami)ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీరాముని శోభయాత్రలు నిర్వహించారు. అయితే, పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఊరేగింపుల సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. దీనిపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోలేదని అన్నారు. లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగీ మాట్లాడుతూ.. రామనవమి సందర్భంగా యూపీ హింసాత్మక సంఘటనలు రాష్ట్రంలో అల్లర్లకు చోటు లేదని చూపించాయని, అది ఇప్పుడు ముందుకు సాగుతున్నదని అన్నారు. ఇది యూపీకి చెందిన కొత్త అభివృద్ధి ఎజెండా చిహ్నమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో ప్రజలు శ్రీరామ నవమి, పవిత్ర రంజాన్ మాసం రెండింటినీ శాంతి, గొప్ప ఉత్సాహంతో జరుపుకున్నారని అన్నారు.
"రామ నవమిని శాంతియుతం.. ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల జనాభా నివసిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 800 రామనవమి ఊరేగింపులు జరిగాయి. ఏకకాలంలో ఈ ఊరేగింపులు కొనసాగాయి. పవిత్ర రంజాన్ మాసం.. రోజా ఇఫ్తార్ కార్యక్రమాలు కొనసాగాయి. రాష్ట్రంలో కలహాలు, ఘర్షణలు లేకుండా జరుపుకున్నారు" అని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఇది యూపీ కొత్త అభివృద్ధి ఎజెండాకు ప్రతీక అని, ఇకపై అల్లర్లకు, అక్రమాలకు, గూండాలకు రాష్ట్రంలో చోటు లేదని సీఎం అన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఆదివారం రామనవమి వేడుకల సందర్భంగా జరిగిన హింసాకాండలో ఇద్దరు మరణించారు. చాలా మంది గాయపడిన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఖర్గోన్లో ముస్లింలు అధికంగా ఉండే పట్టణంలో రామనవమి ఊరేగింపు సందర్భంగా కాల్పులు మరియు హింసకు సంబంధించి కనీసం 94 మందిని అరెస్టు చేసింది. అలాగే, గుజరాత్లోని ఆనంద్ జిల్లా ఖంభాట్ మరియు సబర్కాంత జిల్లా హిమ్మత్నగర్లలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు చోట్లా రాళ్లు రువ్వడం, వస్తులవుకు నిప్పుపెట్టడం వంటి సంఘటనలు జరిగాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు షెల్స్ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.ఖంభాట్లో పోలీసు సూపరింటెండెంట్ అజీత్ రాజ్యన్ మాట్లాడుతూ, "రామ నవమి ఊరేగింపులో రెండు గ్రూపులు ఘర్షణ పడిన స్థలం నుండి సుమారు 65 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం" అని తెలిపారు. హిమ్మత్నగర్లోఒక గుంపు కొన్ని వాహనాలు మరియు దుకాణాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే పరిస్థితి మరింతగా ముదరకుండా రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని నియంత్రించడానికి టియర్గ్యాస్ షెల్లను ఉపయోగించాల్సి వచ్చింది. కొట్లాట సమయంలో కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టుకున్నారని సబర్కాంత పోలీసు చీఫ్ విశాల్ వాఘేలా తెలిపారు.
