దివంగత తమిళనాడు సీఎం  జయలలిత సన్నిహితురాలు శశికళ కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని  ఆదాయపు పన్ను శాఖాధికారులు హైకోర్టులో తేల్చి చెప్పారు. అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డ శశికళకు ఈ మినహాయింపు వర్తించదని, బకాయిలు చెల్లించాల్సిందేనని ఐటీశాఖ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.

చెన్నై: దివంగత తమిళనాడు సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళకు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటీ శాఖ తెలిపింది. 2008లో ఏసీబీ సమర్పించిన నివేదిక మేరకు శశికళ రూ. 48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటీ నోటీసులు ఇచ్చింది. అయితే దీన్ని శశశికళ వ్యతిరేకిస్తూ ఐటీ ట్రిబ్యునల్‌ను శశికళ ఆశ్రయించారు. దీంతో పన్ను చెల్లింపు నుండి ఆమె బయటపడ్డారు. అయితే ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఐటీ శాఖాధికారులు హైకోర్టులో అప్పీల్ చేశాయి.

 గత ఏడాది శశికళ తరపున కోర్టులో కొత్త పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్లను గురువారం హైకోర్టు న్యాయమూర్తులు టీఎస్‌ శివజ్ఞానం, శక్తికుమార్‌ బెంచ్‌ విచారించింది. ఐటీ చెల్లింపు, బకాయిలు, జరిమానా విషయంలో కేంద్రం ఇచ్చిన మినహాయింపులకు సంబంధించిన ఉత్తర్వుల్ని కోర్టు దృష్టికి తెచ్చారు శశికళ న్యాయవాదులు.ఆ మొత్తాన్ని శశికళ చెల్లించాల్సిన అవసరం లేదని వాదించారు.

అయితే అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డ శశికళకు ఈ మినహాయింపు వర్తించదని, బకాయిలు చెల్లించాల్సిందేనని ఐటీశాఖ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. వాదనల అనంతరం శశికళ తరపు వాదనల్ని పిటిషన్‌ రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ కేసును సెప్టెంబరు 8వ తేదీకి వాయిదా వేశారు.