PM Modi Europe Tour: ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో విజేతలెవరూ కాదనీ, శాంతికే భారత్ మద్దతిస్తుందని ప్రధాని మోడీస్పష్టం చేశారు. ఇరు దేశాలు ఈ యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు. యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతున్నాయని, ఉక్రెయిన్లో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయని అన్నారు.
PM Modi Europe Tour: ప్రధాని మోడీ మూడు రోజుల యూరోప్ దేశాల పర్యటనలో భాగంగా తొలి రోజు సోమవారం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో తొలుత జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ను కలిశారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలపై చర్చించారు. సమావేశం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశాలలో భారత్, జర్మనీలు అనేక ఉమ్మడి విలువలను పంచుకుంటున్నాయని, అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు జరపడం రెండు దేశాలు తమ వ్యూహాత్మక సంబంధాలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాయో తెలియజేస్తోందని అన్నారు.
ఈ సందర్భంలో ఉక్రెయిన్- రష్యా యుద్దం గురించి మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో ఎవరూ విజేతలు కాదని అన్నారు. భారతదేశం శాంతికి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఇరు దేశాలు ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ప్రధాని మోడీ కోరారు. యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు కూడా ప్రభావితమవుతున్నాయని, ఉక్రెయిన్లో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఈ యుద్దం వల్ల ప్రత్యేకంగా, పరోక్షంగా అనేక దేశాలు ప్రభావితమతున్నాయనీ, ఆయిల్ ధరలు పెరిగాయని, గ్లోబల్ ఫుడ్ సప్లయి చెయిన్పై కూడా ప్రభావం పడుతుందన్నారు.
యూరప్ పర్యటన సందర్భంగా, మోడీ డెన్మార్క్కు వెళతారు మరియు కోపెన్హాగన్లో డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సెన్ను కలుస్తారు. అలాగే మంగళవారం డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే ప్రధాన మంత్రులతో ఇండియా-నార్డిక్ సమ్మిట్లో పాల్గొంటారు. బుధవారం తిరుగు ప్రయాణంలో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో సమావేశమవుతారు.ద్వైపాక్షిక సహకారం, ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిపారు. ఈ సంవత్సరం ప్రధాని మొదటి విదేశీ పర్యటన కావడం విశేషం.
ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా మాట్లాడుతూ.. పిఎం మోడీ తన మూడు రోజుల పర్యటనలో భాగంగా.. యూరప్ దేశాలలో పర్యటించనున్నారు. యూరప్ పర్యటనలో ఉక్రెయిన్ సమస్యపై చర్చించనున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో పలు కీలక ఒప్పందాలను చేసుకోనున్నారు. ఈ పర్యటనలో దాదాపు 50 మందికి పైగా ప్రపంచ వ్యాపారవేత్తలతో సంభాషించడమే కాకుండా ఏడు దేశాలకు చెందిన నాయకులతో ఆయన ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు.