కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాది కూడ అమర్నాథ్ యాత్ర రద్దు
కరోనా కారణంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా అమర్నాథ్ తీర్థయాత్ర ఈ ఏడాది నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. భక్తులకు ఆన్లైన్ లో ఆరతి సౌకర్యాన్ని కల్పించనున్నారు. అమర్నాథ్ బోర్డు తో చర్చలు జరిపిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ విషయాన్ని ప్రకటించారు.
హిమాలయాల ఎగువన సుమారు 3,880 అడుగుల ఎత్తులో ఉన్న శివుడి ఆలయాన్ని దర్శించుకొనేందుకు ప్రతి ఏటా జూన్ మాసంలో అమర్ నాథ్ యాత్రికులకు ప్రభుత్వం అనుమతిని ఇస్తోంది. జూన్ 28 న వహల్గామ్ , బాల్తాల్ జంట మార్గాల నుండి ఈ యాత్ర ప్రారంభిస్తారు. ఆగష్టు 22న యాత్ర ముగిస్తారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఈ యాత్రను నిర్వహించడం లేదని ఆయన తెలిపారు. కరోనాను పురస్కరించుకొని గత ఏడాది కూడ అమర్ నాథ్ యాత్ర రద్దు చేసిన విషయం తెలిసిందే.
గత వారంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతల అంశం, అభివృద్ది కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ , హోం సెక్రటరీ అజయ్ భల్లా,ఇంటలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు.