బీహార్ సీఎం నితీష్ కుమారే: తేల్చి చెప్పిన బీజేపీ
బీహార్ సీఎంను మార్చే అవకాశం లేదని బీజేపీ స్పష్టం చేసింది. నితీష్ కుమార్ బీహార్ కు మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ బుధవారం నాడు స్పష్టం చేశారు.
పాట్నా: బీహార్ సీఎంను మార్చే అవకాశం లేదని బీజేపీ స్పష్టం చేసింది. నితీష్ కుమార్ బీహార్ కు మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ బుధవారం నాడు స్పష్టం చేశారు.
బీహార్ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాల్లో 74 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 43 స్థానాలకే పరిమితమైంది.బీహార్ లో జేడీ(యూ), బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ)లు కలిసి పోటీ చేశాయి.
also read:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020:40 అసెంబ్లీ సీట్లలో జేడీ(యూ) ను దెబ్బతీసిన ఎల్జేపీ
తమ పార్టీల పొత్తు మేరకు నితీష్ కుమార్ బీహార్ సీఎం అవుతారని సుశీల్ కుమార్ మోడీ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు.ఎన్నికల్లో కొందరు ఎక్కువ గెలుస్తారు, కొందరు తక్కువ గెలుస్తారన్నారు. అయితే మేం సమాన భాగస్వామ్యులు అని ఆయన చెప్పారు.
బీజేపీ స్వంతంగా బీహార్ రాష్ట్రాన్ని పాలించలేదు. రాష్ట్రంలో నితీష్ కుమార్ లేకుండా అధికారాన్ని నిలుపుకోలేదు. కానీ ఈ ధపా మాత్రం ఫలితాలు రాష్ట్రంలో భిన్నంగా ఉన్నాయి.
ఎల్ జే పీ పోటీ చేయడం ద్వారా జేడీ(యూ)కు భారీగా నష్టం వాటిల్లిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎల్ జే పీ రాష్ట్రంలో ఒక్క సీటును గెలుచుకొంది. జేడీ(యూ)కు చెందిన ఓట్లను ఎల్ జే పీ గణనీయంగా చీల్చిందనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఇతర పార్టీల మాదిరిగానే రాష్ట్రంలో తమ పార్టీ కూడ ఎక్కువ సీట్లు గెలవాలని తాను కోరుకొన్నట్టుగా ఎల్ జే పీ నేత చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. బీజేపీకి, ఎల్ జే పీ మధ్య రహస్య అవగాహన ఉందని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది.