కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామని బెదిరింపు కాల్స్.. భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు..
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. నాగ్పూర్లోని గడ్కరీ కార్యాలయంలోని ల్యాండ్లైన్కు 10 నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు ఈ విధమైన ఫోన్ కాల్స్ వచ్చాయి.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. నాగ్పూర్లోని గడ్కరీ కార్యాలయంలోని ల్యాండ్లైన్కు 10 నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు ఈ విధమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. గడ్కరీని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే గడ్కరీ కార్యాలయాన్ని పేల్చివేస్తానని కూడా దుండగుడు ఫోన్లో బెదిరించాడు. దీంతో నితిన్ గడ్కరీ కార్యాలయ ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి నాగ్పూర్ చౌక్లోని ఖమ్లా వద్ద ఉన్న నితిన్ గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ తరపున పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నితిన్ గడ్కరీ కార్యాలయానికి ఉదయం 11:30 నుంచి 11:40 గంటల మధ్య వరుసగా రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాలను పోలీసులకు కూడా ధ్రువీకరించారు.
నితిన్ గడ్కరీ కార్యాలయ ఉద్యోగుల నుంచి సాచారం అందిన వెంటనే.. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం మంత్రి కార్యాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత గడ్కరీ నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.