ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడు బిహార్ వెళ్లి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఒక రోజు యువకుడు నిద్ర లేచి చూడగా పెళ్లి కూతురు, డబ్బు, నగలు మాయం అయ్యాయి. ఆమెకు ఫోన్ చేయగా.. తనకు ఫోన్ చేయవద్దని కట్ చేసేసింది. బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుని, అత్తింటికి వెళ్లి.. డబ్బు, నగదులో ఓ నవవధువు పరారైన ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాలు తెలుసుకుంటే.. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ముందుగా స్కెచ్ వేసి అమాయకుడిని పెళ్లి చేసుకుని దోచేసుకున్నట్టుగానే ఉన్నది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ఇదే నెలలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
అక్టోబర 4వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. కానీ, బాధితుడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తాజాగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్పూర్ జిల్లా బిల్హార్ పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం, జాదేపూర్ గ్రామానికి చెందిన అరవింద్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలో తక్తలీ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము పెళ్లి ఫిక్స్ చేసి పెడతామని, కానీ, తమకు రూ. 70 వేలు కావాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన అరవింద్ను బిహార్లోని గయాకు తీసుకెళ్లారు. అక్కడ ఒక అమ్మాయితో అరవింద్ పెళ్లి ఫిక్స్ చేశారు. అమ్మాయి పేరు రుచి.
అరవింద్ నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత అరవింద్ను ఓ హోటల్కు తీసుకెళ్లారు. అక్కడ ఒక అమ్మాయి ఫొటో చూపెట్టారు. తర్వాతి రోజు అంటే అక్టోబర్ 1వ తేదీన ఆ అమ్మాయితో అరవింద్కు గయాలోని ఓ గుడిలో పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత అరవింద్ సతీ సమేతంగా స్వగ్రామానికి విచ్చేశాడు.
అక్టోబర్ 4వ తేదీన అరవింద్ నిద్ర లేచి చూడగానే రుచి కనిపించలేదు. ఆమెతోపాటు ఇంటిలో ఓ బాక్స్లో దాచిన రూ. 30 వేలు లేవు. ఆమె పెళ్లిలో పెట్టిన నగలు, వస్త్రాలు అన్నీ మాయం అయ్యాయి. ఒక్క క్షణం అరవింద్కు ఏమీ అర్థం కాలేదు.
అరవింద్ ఆ అమ్మాయి రుచికి ఫోన్ చేశాడు. రుచి ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను నిన్ను ప్రేమించడం లేదు. నాకు మళ్లీ ఫోన్ చేయకు అంటూ కటువుగా ఫోన్ కట్ చేసేసింది.
స్టేషన్ హౌజ్ ఆఫీసర్ జగదీశ్ పాండే ఈ కేసును నమోదు చేసినట్టు వివరించారు. దర్యాప్తు మొదలు పెట్టామని, ఆ మహిళను, మ్యారేజ్ ఫిక్స్ చేసిన ఆ ఇద్దరినీ అరెస్టు చేస్తామని తెలిపారు.
