యూపీ అసెంబ్లీలో యోగి ప్రభుత్వం కొత్త రూల్స్ తెస్తున్నది. అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరాదని, లాబీలో బిగ్గరగా నవ్వడం లేదా మాట్లాడటం చేయరాదని, సభలో పేపర్లు చింపేయకూడదని ఈ రూల్స్ చెబుతున్నాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం కొత్త రూల్స్ తెస్తున్నది. అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తేకుండా ఈ రూల్స్ నిలువరించనున్నాయి. పేపర్లను చించేయడాన్నీ అనుమతించవు. స్పీకర్ వైపునకు వీపు పెట్టి నిలబడటం, కూర్చోవడం చేయకూడదంటూ ఈ రూల్స్ చెబుతున్నాయి.
1958లో యూపీ అసెంబ్లీ రూల్స్ పాస్ చేశారు. వాటిని రిప్లేస్ చేస్తూ తాజాగా కొత్త రూల్స్ తెస్తున్నారు. ఈ రూల్స్ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం ఆ రూల్స్ పై చర్చ చేస్తారు. అనంతరం, ఆమోదిస్తారని యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానా చెప్పారు.
ఈ కొత్త రూల్స్ ప్రకారం, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పేపర్లు చించేయడానికి లేదు. ప్రసంగిస్తూ లేదా ప్రశంసిస్తునైనా గ్యాలరీలోని ఇతరులకు వేలు చూపించకూడదు. స్పీకర్ వైపునకు వీపు చూపిస్తూ నిలబడటం లేదా కూర్చోవడం చేయకూడదు. అలాగే, సభలోకి ఆయుధాలు తీసుకురావడం లేదా ప్రదర్శించడాన్ని కొత్త రూల్స్ అనుమతించవు.
సభలో పొగ త్రాగరాదని ఈ రూల్స్ నిర్దేశిస్తున్నాయి. అలాగే.. లాబీలో బిగ్గరగా నవ్వడం లేదా మాట్లాడటం చేయకూడదని ఆదేశిస్తున్నాయి. ఈ రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేలు స్పీకర్ ఆసనానికి గౌరవసూచకంగా వంగి నమస్కరించాలి.
