దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..!
ఇప్పటి వరకు మొత్తం 3.05కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.35శాతం గా ఉంది. 24గంటల వ్యవధిలో మరో 546 మందిని కోవిడ్ బలి తీసుకోవడం గమనార్హం.
దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. నిన్న కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగాయి. అంతేకాక.. వైరస్ నుంచి కోలుకున్నవారి కంటే.. కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు దేశవ్యాప్తంగా 16.31లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 39,097 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.
దీంతో.. దేశంలో మొత్తం కరోనా కేసులు 3.13 కోట్లు దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే సమయంలో 35,087 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 3.05కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.35శాతం గా ఉంది. 24గంటల వ్యవధిలో మరో 546 మందిని కోవిడ్ బలి తీసుకోవడం గమనార్హం.
మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు 4,20,016 మంది మృత్యువాత పడ్డారు. ఇక కొత్త కేసులు అధికమవ్వడంతో యాక్టివ్ కేసులు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,08,977 మంది వైరస్ తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరింది.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త పుంజుకున్నట్లే కనిపిస్తోంది. శుక్రవారం 42.67లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో.. ఇప్పటివరకు 42.78కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.