ప్రధాని మోదీ డిగ్రీ అర్హత మీద జరుగుతున్న చర్చపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో మోదీని గెలిపించింది డిగ్రీ కాదని అన్నారు.  

ముంబై : భారత ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ పట్టాపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని డిగ్రీ మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనిని ఎన్సీపీ నేత అజిత్ పవర్ తపు పట్టారు. మంత్రి ఎవరైనా సరే వారి డిగ్రీల కోసం పట్టుపట్టొద్దని… ప్రశ్నించడం సరికాదని.. ఆ మంత్రి ప్రజల కోసం ఏం చేశాడో చూడాలని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ‘2014లో ప్రజలు మోడీకి ఎందుకు ఓటేశారు? ఆయన డిగ్రీ చూసి ఓటేశారా? కాదు కదా.. అప్పటికే ఆయనకు ప్రజల్లో ఉన్నఆకర్షణే ఆయనను గెలిపించింది. అప్పటి నుంచి తొమ్మిదేళ్లుగా అప్రతిహతంగా దేశాన్ని పాలిస్తున్నారు. అలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదు. 

ఆయనను తప్పకుండా ప్రశ్నించాలి.. కానీ డిగ్రీ విషయంలో కాదు.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి అంశాల్లో ప్రశ్నలు సంధించాలి. ఇక్కడ డిగ్రీ ముఖ్యం కాదు. ఒకవేళ ప్రధాని డిగ్రీ మీద స్పష్టత కనక వస్తే.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గిపోతుందా? ప్రజలకు ఉద్యోగాలు వచ్చేది ఏదైనా ఉందా? అని పవర్ సూటిగా ప్రశ్నించారు. ఆయన ఈ వ్యాఖ్యలను ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

పెరుగుతున్న క‌రోనావైర‌స్ వ్యాప్తి.. హాస్టల్లో 19 మంది బాలికలకు పాజిటివ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మోడీ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని అందించాలని గుజరాత్ యూనివర్సిటీని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. అయితే, ఇది ఏడేళ్ల క్రితం నాటి మాట. ఈ ఆదేశాల మీద హైకోర్టుకు వెళ్లడంతో.. దీని మీద గుజరాత్ హైకోర్టు శుక్రవారం స్పందిస్తూ.. ఆదేశాలను కొట్టేసింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పు మీద కేజ్రీవాల్ మాట్లాడుతూ… కోర్టు తీర్పుతో మోడీ విద్యార్థత మీద మరింత అనుమానం పెరిగిందని అన్నారు.

మోదీ కనక విద్యావంతుడై ఉంటే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు అంత ఈజీగా తీసుకోకపోయి ఉండేవాడని అన్నారు. కేజ్రీవాల్ విమర్శలను బిజెపి తిప్పి కొట్టింది. కేజ్రివాల్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని.. అతని ప్రభుత్వ అవినీతిని దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలతో వెలికి తీస్తున్న నేపథ్యంలో కేజ్రివాల్ ఈ మేరకు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని బిజెపి అంటోంది.