ఇదే లాస్ట్ ఛాన్స్.. మీతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ ఇస్తారా: సోనియాగాంధీకి సిద్ధూ లేఖ
వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు నవ్జోత్ సింగ్ సిద్ధూ సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం 13 పాయింట్ల అజెండాను అమలు చేయాలంటూ తాజాగా సిద్ధూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ పంజాబ్ వ్యవహారాలు కాంగ్రెస్ (congress) అధిష్టానాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఇక్కడ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (captain amrinder singh), పీసీసీ (punjab pcc) చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ (navjot singh sidhu) మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. ఎన్నికల నేపథ్యంలో దళిత వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు గాను చరణ్ జిత్ సింగ్ చన్నీకి (charanjit singh) సీఎంగా బాధ్యతలు కట్టబెట్టింది. అయితే తర్వాత కొన్ని రోజులకే సిద్ధూ పీసీసీ పదవికి రాజీనామా చేసి దుమారం రేపారు. తాజాగా రాహుల్ను (rahul gandhi) కలిసిన సిద్ధూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఆయన సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం 13 పాయింట్ల అజెండాను అమలు చేయాలంటూ తాజాగా సిద్ధూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి (sonia gandhi) లేఖ రాశారు. ఇవాళ ఆ లేఖను ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. దైవదూషణ కేసుల్లో న్యాయం, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నివారణ, విద్యుత్ కష్టాలు, పీపీఏలు, వ్యవసాయ సమస్యలు, ఉపాధి కల్పన, ఇసుక మైనింగ్, ఎస్సీ–బీసీల సంక్షేమం, సింగిల్ విండో సిస్టమ్, మహిళలు–యువత సాధికారత, మద్యం, రవాణా రంగం, కేబుల్ మాఫియా వంటి సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నవజోత్ సింగ్ సిద్ధూ కోరారు.
Also Read:ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా.. గెలిచి అసెంబ్లీకొచ్చినా వదలను: సిద్ధూపై అమరీందర్ సంచలన వ్యాఖ్యలు
ఈ అంశాలన్నింటిపై మాట్లాడేందుకు, చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా సోనియా గాంధీని లేఖలో ఆయన కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు జరిగిన నష్టాన్ని నివారించేందుకు ఇదే చివరి అవకాశమని, ఇకనైనా వాటిని సరిచేసుకుంటే మంచిదని సిద్ధూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు కొద్దిరోజుల క్రితం పంజాబ్ మాజీ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీలో అవసరమైతే బలనిరూపణ కోరతానని అమరీందర్ స్పష్టం చేశారు. సిద్ధూని ఎట్టి పరిస్ధితుల్లోనూ గెలిపించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
మరోవైపు తాను కాంగ్రెస్లో వుండలేనని.. అలాగని బీజేపీలో చేరడం లేదన్నారు అమరీందర్ సింగ్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త పార్టీ పెడుతున్నట్లు స్పష్టం చేశారు. పంజాబ్లో కాంగ్రెస్ దిగజారుతోందని, సిద్ధూ లాంటి వ్యక్తికి పార్టీలో సీరియస్ పనులు అప్పగించిందని ఆయన దుయ్యబట్టారు.