ఈ నెల చివరిలో బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. శని, ఆదివారాలతో సాధారణ సెలవులు కాగా.. సోమ, మంగళవారం బ్యాంకులు సమ్మెకు దిగుతున్నాయి. దీంతో ఖాతాదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.   

మార్చి 28,29 తేదీల్లో బ్యాంకులు స‌మ్మెకు వెళ్ల‌నున్నాయి. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ స‌మ్మెకు దిగుతున్నామని బ్యాంకులు ప్ర‌క‌టించాయి. దీంతో బ్యాంకుకు వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు ఉండ‌నున్నాయి. 26వ తేదీన శ‌నివారం, 27వ తేదీ ఆదివారం కావ‌డంతో అవి సాధార‌ణ సెల‌వులు కాగా.. మిగితా రెండు రోజులు స‌మ్మె ఉండ‌టంతో పూర్తిగా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవ‌లు నిలిచిపోనున్నాయి. 

బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప‌లు బ్యాంకు ఉద్యోగ‌ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఇందులో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (BEFI), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AOBOA) పాల్గొంటున్నాయి. ఆయా యాజ‌మాన్యాల‌కు ఇది వ‌ర‌కే ఆ సంఘాలు నోటీసులు అంద‌జేశాయి.

రెండు రోజుల స‌మ్మె నేప‌థ్యంలో బ్యాంక్ సాధార‌ణ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సమ్మె వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయలేమని పేర్కొంది. కాగా బ్యాంకులకు సెలవులు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ నెలలో చాలా రోజుల పాటు బ్యాంకులు ఉండ‌నున్నాయి. 

ఏప్రిల్‌లో 15 రోజుల పాటు సెల‌వులు..
ఏప్రిల్ లో బ్యాంకు సెల‌వు రోజుల‌ను ఆర్బీఐ ఇటీవ‌లే విడుద‌ల చేసింది. వ‌చ్చే నెల‌లో అనేక పండుగలు ఉన్నాయి. వాటి కారణంగా అనేక బ్యాంక్ బ్రాంచ్ లు మూసి ఉంటాయి. దాదాపుగా జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ 15 రోజుల పాటు సెలవులు ఉండే అవ‌కాశం ఉంది. ఈ నెల చివ‌రిలో కూడా వ‌రసుగా నాలుగు రోజుల పాటు సెల‌వులు వ‌స్తున్నాయి. ఈ సెలవుల, స‌మ్మె దృష్ట్యా బ్యాంకింగ్ వ్య‌వ‌హారాలు త్వరగా పరిష్కరించుకోవాలని ఆర్బీఐ సూచించింది. గుడి పడ్వా, అంబేద్కర్ జయంతి, బైశాఖి, ఉగాది వంటి పండుగల కారణంగా వచ్చే నెల సెల‌వులు ఉండ‌నున్నాయి. అయితే ప్రాంతీయ స్థాయిలో సెలవుల జాబితా కూడా విడుద‌లైన నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా బ్యాంకులు ఒకే స‌మ‌యంలో మూసి ఉండే అవ‌కాశం లేదు. ప్రతీ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవులు ఒకే రోజు ఉండవు.