కేంద్ర ప్రభుత్వం పబ్లిసిటీ కోసం 2018 నుంచి ఇప్పటి వరకు రూ. 3,064.42 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై 13వ తేదీ వరకు రూ. 43.16 కోట్లు ఖర్చు పెట్టిందని కేంద్రప్రభుత్వం పెద్దల సభకు తెలిపింది. 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2018-19 నుంచి పబ్లిసిటీ కోసం రూ. 3,064.42 కోట్లను ఖర్చు పెట్టింది. ఇందులో ప్రింట్ మీడియా టాప్ కేటగిరీలో ఉన్నది. మొత్తంగా చూసుకుంటే అడ్వర్టయిజ్‌మెంట్ ఖర్చు తగ్గింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ రాజ్యసభకు గత వారం అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది.

2019-19 నుంచి 2023-24 (జులై 13వ తేదీ వరకు) మధ్యకాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రింట్ మీడియాలో ప్రచారం కోసం రూ. 1,338.56 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కోసం రూ. 1,273.06 కోట్లు, ఔట్ డోర్ పబ్లిసిటీ కోసం రూ. 452.80 కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తంగా చూసుకుంటే 2018-19లో రూ 1,179.16 కోట్లు ఖర్చు పెట్టగా.. అదే 2022-23 మధ్య కాలంలో రూ. 408.46 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే.. ప్రచార ఖర్చు తగ్గింది.

Also Read: లిక్కర్‌కు డబ్బుల్లేవని ఆరు నెలల పాపను అమ్ముకున్నారు.. తల్లి, తండ్రి, తాత అరెస్టు

2019-20లో ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం 708.18 కోట్లు ఖర్చు పెట్టింది. 2020-21లో ఈ ఖర్చు రూ. 409.47 కోట్లకు తగ్గింది. 2021-22లో రూ. 315.98 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ,2022-23లో ఈ ఖర్చు మళ్లీ పెరిగింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో కేంద్రం రూ. 43.16 కోట్లు అడ్వర్టయిజ్‌మెంట్ కోసం ఖర్చు పెట్టింది. గత వారం కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను వెల్లడించింది.