Asianet News TeluguAsianet News Telugu

మైసూరు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

రాజకీయంగానూ మైసూరుకు ఎంతో ప్రాధాన్యత వుంది. పాత మైసూరు ప్రాంతంపై పట్టు కోసం నేటికీ పార్టీల మధ్య పోరు నడుస్తూనే వుంటుంది. కర్ణాటకలోని వీఐపీ సెగ్మెంట్లలో మైసూర్ ఒకటి. ఈ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మైసూర్ నుంచి హస్తం పార్టీ 12 సార్లు, బీజేపీ 4 సార్లు, కేఎంపీపీ ఒకసారి విజయం సాధించాయి. మైసూరు పరిధిలోని 8 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల, జనతాదళ్ 2 చోట్ల, బీజేపీ ఒకచోట విజయం సాధించాయి. మైసూరు మహారాజా యదువీర్ కృష్ణదత్త వడియార్ ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా స్థానంలో బీజేపీ ఆయనను మైసూర్ సెగ్మెంట్ నుంచి అభ్యర్ధిగా నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఎం లక్ష్మణ్ పోటీ చేస్తున్నారు. 

Mysore Lok Sabha elections result 2024 ksp
Author
First Published Apr 1, 2024, 4:16 PM IST

మైసూర్ .. దేశంలో ఈ నగరం గురించి తెలియనివారుండరు. ఆహ్లాదకరమైన వాతావరణానికి, రాజరికానికి, ఘనంగా జరిగే దసరా వేడుకలకు , కొండపై కొలువైయున్న చాముండేశ్వరి దేవి క్షేత్రానికి మైసూర్ కేంద్రం. టిప్పు సుల్తాన్, వడయార్ రాజవంశీయులు మైసూర్ నుంచి పాలన సాగించారు. రాజ్యాలు, రాచరికం అంతరించినా నేటికీ రాజులంటే సామాన్యుల్లో భక్తి మాత్రం తగ్గలేదు. రాజసంతో వెలిగే మైసూర్ కోట నేటికీ అలనాటి చారిత్రక వైభవాన్ని గుర్తుచేస్తూనే వుంటుంది. కర్ణాటకకు బెంగళూరు రాజధాని అయినా.. నిజానికి ఆ రాష్ట్ర చారిత్రక, సంస్కృతిక, వారసత్వ, కళా రాజధాని మాత్రం మైసూరే. 

మైసూరు ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్ కంచుకోట : 

రాజకీయంగానూ మైసూరుకు ఎంతో ప్రాధాన్యత వుంది. పాత మైసూరు ప్రాంతంపై పట్టు కోసం నేటికీ పార్టీల మధ్య పోరు నడుస్తూనే వుంటుంది. కర్ణాటకలోని వీఐపీ సెగ్మెంట్లలో మైసూర్ ఒకటి. మైసూర్ రాజవంశీకులతో పాటు హేమాహేమీలు అనదగ్గ నేతలు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మరోసారి మైసూర్‌ వార్తల్లో నిలిచింది. 1952లో ఏర్పడిన ఈ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మైసూర్ నుంచి హస్తం పార్టీ 12 సార్లు, బీజేపీ 4 సార్లు, కేఎంపీపీ ఒకసారి విజయం సాధించాయి. మైసూర్ లోక్‌సభ స్థానం పరిధిలో మడికెరి, విరాజ్‌పేట, పేరియపట్న, హునసూరు, చాముండేశ్వరి, కృష్ణరాజ, చామరాజ, నరసింహరాజ అసెంబ్లీ స్థానాలున్నాయి . 

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మైసూరు పరిధిలోని 8 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల, జనతాదళ్ 2 చోట్ల, బీజేపీ ఒకచోట విజయం సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ప్రతాప్ సింహాకు 6,88,974 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి సీహెచ్ విజయశంకర్‌కు 5,50,327 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 1,38,647 ఓట్ల మెజారిటీతో మైసూరులో విజయం సాధించింది. 2024 ఎన్నికల విషయానిక వస్తే.. గత కొన్నేళ్లుగా బీజేపీ ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ వుండటంతో మైసూరుపై పట్టు నిలుపుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా మైసూర్ రాజకుటుంబాన్ని బరిలో దింపింది.

మైసూరు ఎంపీ (పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. రాజకీయాల్లో యదువీర్ వడియార్ : 

మైసూరు మహారాజా యదువీర్ కృష్ణదత్త వడియార్ ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా స్థానంలో బీజేపీ ఆయనను మైసూర్ సెగ్మెంట్ నుంచి అభ్యర్ధిగా నిలబెట్టింది. 31 ఏళ్ల యదువీర్ అమెరికాలో చదువుకున్నారు. 2015 మే 28న వడియార్ రాజవంశానికి 27వ రాజుగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. వడియార్ రాజవంశ చివరి వారసుడు శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ సతీమణి ప్రమోదా దేవి వడియార్.. ఈ దంపతులకు పిల్లలు లేనందున యదువీర్ గోపాల్ రాజ్ ఉర్స్‌ను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత అతనికి యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ అని నామకరణం చేశారు. 

పాత మైసూరు ప్రాంతంలో (దక్షిణ కర్ణాటక) రాజకుటుంబానికి ఇప్పటికీ గణనీయమైన గౌరవం, అభిమానం వున్నాయి. ఈ కారణంగా కాంగ్రెస్ దూకుడుకు యదువీర్‌తో కళ్లెం వేయొచ్చని కమలనాథులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఎం లక్ష్మణ్ పోటీ చేస్తున్నారు. మైసూరు లోక్‌సభ స్థానం పరిధిలో బలంగా వుండటం, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వుండంతో ఈసారి గెలుస్తామని హస్తం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైసూరులో కాంగ్రెస్ గెలిచి దాదాపు 15 ఏళ్లు కావొస్తోంది. చివరిసారిగా 2009లో ఇక్కడ ఆ పార్టీ విజయం సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios