మహారాష్ట్రలో మసీదుల ముందు లౌడ్స్పీకర్ల వివాదం రగులుతున్నది. మసీదుల ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామన్న ఎంఎన్ఎస్ పిలుపు కలకలం రేపుతన్నది. ఈ నేపథ్యంలోనే నాసిక్ పోలీసులు స్పష్టమైన ఆదేశాలు వెలువరించారు. మతప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు వినియోగించడానికి ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. అజాన్కు ముందు వెనుక 15 నిమిషాల లోపు హనుమాన్ చాలీసా పఠనం, భజనలు చేయరాదని, మసీదుకు 150 మీటర్ల పరిధికి మించిన దూరంలో మాత్రమే ఈ పఠనం ఉండాలని తెలిపారు.
ముంబయి: మహారాష్ట్రలో అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా వివాదం కలకలం రేపింది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు మూయించాలని ఎంఎన్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వివాదాన్ని రాజేసింది. దీనిపై అధికార శివసేన పార్టీ స్పందించింది. పోలీసులూ రంగంలోకి దిగారు. డిమాండ్లకు అనుగుణంగా నిబంధనలను రూపొందించాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తాజాగా, నాసిక్ పోలీసులు నూతన ఆదేశాలు జారీ చేశారు. మసీదుల్లో అజాన్ను ఆలపించడానికి వెనుకా ముందు 15 నిమిషాల వరకు లౌడ్స్పీకర్లలో
హనుమాన్ చాలీసా లేదా భజనలు చేయరాదని పోలీసులు ఆదేశించారు. అంతేకాదు, ఏ మతపరమైన ప్రదేశాల్లోనైనా ముందస్తు అనుమతి లేకుండా లౌడ్స్పీకర్లను వాడరాదని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు వినియోగించాలనుకుంటే మే 3వ తేదీ లోపు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక వేళ హనుమాన్ చాలీసాను లౌడ్స్పీకర్లలో పఠించాలన్నా మసీదు నుంచి 150 మీటర్ల పరిధికి మించిన దూరం పాటించాలని వివరించారు. లా అండ్ ఆర్డర్ను మెయింటెయిన్ చేయడానికే ఈ ఆదేశాలు వెలువరిస్తున్నట్టు పేర్కొన్నారు.
లౌడ్స్పీకర్ వినియోగాలనికి మే 3వ తేదీ లోపు అనుమతులు తీసుకోవాలని, మే 3వ తేదీ తర్వాత ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన లీగల్ చర్యలు తీసుకుంటామని నాసిక్ పోలీసు కమిషనర్ దీపక్ పాండే తెలిపారు.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే లౌడ్స్పీకర్లపై ప్రకటన చేశారు. మే 3వ తేదీ లోపు మసీదుల నుంచి లౌడ్స్పీకర్లు తొలగించకుంటే హిందూ సోదరులు సిద్ధం కండి అంటూ పిలుపు ఇచ్చారు. ఈ దేశంలోని హిందు ధర్మ రక్షకులారా మే 3వ తేదీ వరకు, 3వ తేదీ తర్వాత కూడా జాగరూకతగా ఉండాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే మసీదులు లౌడ్స్పీకర్ తొలగించకుంటే దాని ఎదుట హనుమాన్ చాలీసా పఠించండి అంటూ పేర్కొన్నారు. తాము కూడా హనుమాన్ చాలీసాను 5 సార్లు పఠిస్తామని అన్నారు. పూణెలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొంత కాలంగా మహారాష్ట్రలో మసీదుల లౌడ్ల స్పీకర్ల విషయంలో గొడవ జరుగుతోంది. ఈ గొడవకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ఆజ్యం పోశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని, లేకపోతే ఆ మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. ఈ వాఖ్యలు మహారాష్ట్రలో దుమారాన్ని రేపాయి. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఇదే విషయంపై మళ్లీ తాజాగా రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మసీదుల నుండి లౌడ్స్పీకర్లను తొలగించాలనే డిమాండ్ తన ముస్లింల ప్రార్థనల వ్యతిరేకత నుండి ఉద్భవించలేదని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఎలాంటి అల్లర్లూ జరగడం తమ పార్టీకి ఇష్టం లేదని థాకరే అన్నారు.
“ మాకు మహారాష్ట్రలో అల్లర్లు అక్కర్లేదు. ప్రార్థనలు చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. కానీ మీరు (ముస్లింలు) లౌడ్స్పీకర్లో ప్రార్థన చేస్తే, మేము కూడా దాని కోసం లౌడ్స్పీకర్లను ఉపయోగిస్తాము. చట్టం కంటే మతం పెద్దది కాదని ముస్లింలు అర్థం చేసుకోవాలి. మే 3 తర్వాత ఏం చేయాలో చూస్తాను’’ అని రాజ్ థాకరే అన్నారు.
ఇటీవల ఆయన గుడి పడ్వా ర్యాలీ సందర్భంగా రాజ్ సందర్భంగా ఈ విషయంలో మాట్లాడారు. రాష్ట్రంలో మే 3వ తేదీ నాటికి మసీదుల్లో లౌడ్ స్పీకర్లను మూసివేయాలని ఆయన రెండో సారి అల్టిమేటం జారీ చేశారు. ఈ ప్రకటన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఠాక్రేపై బలంగా విమర్శించింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మహారాష్ట్రలో రాజ్ థాకరే పాత్రను ఉత్తరప్రదేశ్లో అసదుద్దీన్ ఒవైసీతో పోల్చారు.
