హిజాబ్ వివాదం నేపథ్యంలో రేపు కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి. నిన్న కర్ణాటక హైకోర్టు తీర్పుపై సంఘాలు చర్చించాయి.
బెంగుళూరు: Hijab వివాదం నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి. హిజాబ్ విషయమై Karnataka High court మంగళవారం నాడు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో యూనిఫామ్ను ధరించాల్సిందేనని తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని కూడా తెలిపింది.
ఈ తరుణంలో కర్ణాటకకు చెందిన అమీర్ ఎ షరియత్ మౌలానా సగీర్ అహ్మద్ ఖాన్ రషాదీ గురువారం నాడు రాష్ట్ర Bandh కు పిలుపునిచ్చారు.హైకోర్టు తీర్పు తర్వాత ఇవాళ పలు సంస్థలు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకొన్నారు. హైకోర్టు తీర్పు నిరుత్సాహపరిచిందని ముస్లిం మత పెద్దలు అభిప్రాయపడ్డారు.
తమ మత విశ్వాసాలను అనుసరించడంతో పాటు విద్యను పొందడం సాధ్యమని కూడా ప్రభుత్వానికి తెలపాలని తాము భావిస్తున్నామని సగీర్ అహ్మద్ ఖాన్ రషాదీ చెప్పారు.
బంద్ సందర్భంగా ఎలాంటి నినాదాలు చేయవద్దని కూడా ఆయన కోరారు. బలవంతంగా దుకాణాలు మూసివేయడం, ఊరేగింపులు నిర్వహించవద్దని కూడా ఆయన సూచించారు. బంద్ పై ఏకాభిప్రాయం కుదిరిందని సమావేశానికి హాజరైన జమాతే ఇస్లామీ హింద్ సభ్యులు చెప్పారు.
జనవరి 1న కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఈ హిజాబ్ వివాదం రాజుకుంది. ఆరుగురు ఓ వర్గానికి చెందిన బాలికలు హిజాబ్ ధరించి క్లాసులకు హాజరయ్యారు. దీనిని కాలేజీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. దీంతో ఈ వివాదం మొదలైంది. ముస్లిం బాలికల హిజాబ్ ధరించి రావడంతో కొంత మంది మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి క్లాసులకు రావడం మొదలు పెట్టింది. దీంతో రెండు ఉడిపిలో వర్గాల మధ్య మొదలైన ఈ సమస్య రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ఇది పెద్ద ఆందోళనకు దారి తీసింది.
అయితే ఫిబ్రవరి 9న ఉడిపికి చెందిన ముస్లిం బాలికలు కోర్టుకు వెళ్లారు. హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించడానికి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ జెఎం ఖాజీ, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్లతో కూడిన పూర్తి బెంచ్ ఏర్పాటు అయ్యింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును రోజూ విచారించింది. ఆందోళనల కారణంగా మూతపడిన విద్యాసంస్థలను తిరిగి తెరవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు క్లాస్రూమ్లో హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించడాన్ని కూడా కోర్టు నిషేధించింది.
హిజాబ్ వివాదంపై 11 రోజుల పాటు హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ తీర్పు వెలవడే వారం రోజుల ముందు నుంచి బెంగళూరు వంటి ముఖ్య పట్టణాల్లో పెద్ద సమావేశాలను కర్ణాకట ప్రభుత్వం నిషేదించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నందున వివాదానికి కారణమైన దుస్తులను ప్రభుత్వం ఈ ఏడాది పిబ్రవరి 5న నిషేధం విధించిన విషయం తెలిసిందే.
