ఆమె ఓ మున్సిపల్ కమిషనర్. అల్లారు ముద్దుగా ఓ జర్మన్ షెపర్డ్ రకానికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. అయితే ఆ కుక్క ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయింది. దీంతో దానిని వెతికిపట్టుకునేందుకు పోలీసులు ముప్పుతిప్పలు పడుతున్నారు.
మున్సిపల్ కమిషనర్ కుక్క కనిపించకుండా పోవడంతో పోలీసులు నానా హడావిడి చేశారు. ఏకంగా విశ్రాంతి లేకుండా 500 ఇళ్లలో సోదాలు జరిపారు. అయినా ఆ కుక్క జాడ వారికి కనిపించలేదు. ఓ కుక్క ను వెతికిపట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు
వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని మీరట్ మున్సిపల్ కమిషనరేట్ లో సెల్వ కుమారి అనే మహిళ కమిషనర్ గా పని చేస్తున్నారు. ఆమె కొంత కాలంగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్క జర్మన్ షెపర్డ్ రకానికి చెందినది. దానికి ఆ కమిషన్ ‘ఎకో’ అని పేరు పెట్టి ముద్దుగా చూసుకుంటున్నారు. అయితే ఆ కుక్క ఉన్నట్టుండి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో కనిపించకుండా పోయింది.
దీంతో ఈ విషయం కమిషనర్ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆమె తెలిపారు. దీంతో ఇక వారు అప్పటి నుంచి ఆ కుక్క కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 36 గంటల్లో పోలీసులు ఇంటింటికీ వెళ్లారు. సుమారు 500 ఇళ్లలో విచారణ జరిపారు. అయితే ఫలితం లేకుండా పోయింది. మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ హర్పాల్ సింగ్ తన బృందంతో అర్ధరాత్రి 12 గంటలకు కమిషనర్ నివాసానికి చేరుకున్నారు. వారు కుక్క ఫోటో తీసుకొని వెతకడం ప్రారంభించారు.
ఆ బృందం రాత్రంతా గాలింపు చేపట్టినా పెంపుడు కుక్క జాడ కనిపించలేదు. కుక్క ఎప్పుడు, ఎలా కనిపించకుండా పోయిందో తెలియదని కమిషనర్ సెల్వ కుమారి జె తెలిపారు. కుక్క ఆచూకీ కోసం పోలీసులు సీసీ కెమెరాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. మునిసిపల్ రికార్డుల ప్రకారం, నగరంలో ఈ జాతికి చెందిన 19 కుక్కలు మాత్రమే ఉన్నాయి. కుక్కను ఎవరో తమ ఇంట్లో ఉంచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కొన్ని స్థానిక మీడియా సంస్థలు ఆ కుక్క ఆచూకీ లభించిందని పేర్కొంది.
