Mumbai Police Siezed Drugs:  మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘర్ జిల్లాలో కోట్లాది రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలను పోలీసులు ప‌ట్టుకున్నారు. దాదాపు రూ. 1,400 కోట్ల విలువ చేసే 700 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ఐదుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒక‌రూ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్..   

Mumbai Police Siezed Drugs: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఏకంగా 700 కేజీల నిషేధిత మాద‌క ద్ర‌వ్యాల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. అంత‌ర్జాతీయ‌ మార్కెట్‌లో దాని విలువ సుమారు రూ.1400 కోట్లుకు పై మాటే.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసొపారాలో ఉన్న ఫార్మా స్యూటికల్ తయారీ యూనిట్‌పై ముంబై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ. 1,400 కోట్ల విలువైన 700 కిలోలకు పైగా 'మెఫెడ్రోన్'ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ డ్రగ్ సెల్ (ANC) ఈ దాడులు నిర్వహించిందని పోలీసులు తెలిపారు. యాంటీ డ్రగ్ సెల్ కు ఈ ప్రాంతంలో నిషేధిత డ్రగ్ 'మెఫెడ్రోన్' తయారు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు.

నిందితుల్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ 

ఈ డ్ర‌గ్స్ ముఠాలో ఒక్క‌రు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అని, తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రగ్స్ తయారు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిషేధిత డ్ర‌గ్స్ వ్యాపారం చేస్తున్నందుకు నలుగురు నిందితులను ముంబైలో అరెస్టు చేయగా, మరొకరిని నాలాసోపరాలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంత మొత్తంలో డ్రగ్స్ రికవరీ చేయ‌డం ఇదే తొలిసార‌ని పోలీసులు చెబుతున్నారు. 'మెఫెడ్రోన్ ని.. మియావ్ మియావ్' లేదా MD అని కూడా అంటారు.దీనిని నేషనల్ నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) నిషేధించింది.