కూరగాయలు సరిగా కోయడం లేదని అత్త సాధింపు.. తట్టుకోలేక కత్తితో 26 పోట్లు పొడిచిన కోడలు..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 కోట్లు పొడవడంతో అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. దాడి చేసిన అనంతరం కోడలు తట్టాబుట్టా సర్దుకుని పరార్ అయింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది.
జైపూర్ : అత్తాకోడళ్ళ మధ్య ఎప్పుడూ పొసగదు. భర్త, కుమారుడితో బాగానే ఉండే వీరు వారిద్దరూ ఎదురు పడ్డప్పుడు మాత్రం ఏం జరుగుతుందో ఏమో అగ్గిమీద గుగ్గిలమవుతారు. గుంటూరు జిల్లాలో చపాతీ కర్రతో అత్త పై దాడి చేసిన ఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు కోయమని చెప్పడంతో ఆ కోడలు అత్తపై కత్తితో దాడి చేసింది. సరిగ్గా తరగకపోవడంతో దుర్భాషలాడుతూ కోడలు క్షణికావేశంలో అదే కత్తితో పొడిచింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 కోట్లు పొడవడంతో అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. దాడి చేసిన అనంతరం కోడలు తట్టాబుట్టా సర్దుకుని పరార్ అయింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది.
జైపూర్లోని భంక్రోటాకు చెందిన అత్తాకోడళ్లు మోహిని దేవి (62)తన కుమారుడికి పద్నాలుగేళ్ల కిందట మమతా దేవితో (35)తో వివాహం జరిపించింది. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట కోసం కోడలు కూరగాయలు కోస్తుంది. సరిగా కోయడం లేదని అత్తగారు కోడలిని తిట్టిపోసింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఇక తట్టుకోలేని కోడలు క్షణికావేశంలో కూరగాయలు కోస్తున్న కత్తితోనే అత్త పై దాడికి పాల్పడింది. ఏకంగా ఇరవై ఆరు చోట్ల పొడవడంతో మోహిని దేవి కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కోడలు తన పిల్లలను తీసుకుని పరారైపోయింది.
స్థానికుల సమాచారంతో ఇంటికి వచ్చిన కుమారుడు రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న తన తల్లిని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూసింది. తన తల్లిని హతమార్చిన భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారైన కోడలు మమతను పోలీసులు గాలించి ఎట్టకేలకు అరెస్టు చేశారు. మమతకు ఇద్దరు అబ్బాయిలు ఒక కూతురు ఉంది.