ఢిల్లీలో మళ్లీ కలకలం.. శ్రద్ధా వాకర్ను పోలిన హత్య.. తల్లి, కొడుకుల ఘాతుకం (వీడియో)
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య మరువకముందే అదే రీతిలో అంతకు ముందే జరిగిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం వివాదంతో ఓ వ్యక్తిని తల్లీ కొడుకు కలిసి జూన్లో హతమార్చారు. ఆ డెడ్ బాడీ పార్టులను ఫ్రిడ్జీలో దాచి తూర్పు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేసినట్టు పోలీసులు గుర్తించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకున్న శ్రద్ధా వాకర్ అతి దారుణ హత్య ఇంకా వెంటాడుతూనే ఉన్నది. దేశవ్యాప్తంగా ఈ హత్య కలకలం రేపింది. మనిషి ఇంత దారుణంగా సాటి మనిషిని చంపేస్తాడా? అని నివ్వెరపరిచింది. దీని నుంచి ఇంకా తేరుకోకముందే అదే ఢిల్లీలో మరో హత్య జరిగింది. అది కూడా శ్రద్ధా వాకర్ను హతమార్చిన రీతిలోనే జరగడం మరోసారి కలకలం రేపింది. తల్లి, కొడుకు కలిసి ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి, ఆ పార్టులను ఫ్రిడ్జీలో దాచి తూర్పు ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పడేశారు.
ఈ హత్య జూన్లో జరిగింది. ఆ బాడీ పార్టులు కొన్ని చోట్ల పోలీసులు చూశారు. కానీ, అవి అప్పటికే కుళ్లిపోయి ఉన్నాయి. అయితే, అవి ఒక మనిషివి అయి ఉంటాయని ఊహించలేదు. అనుమానపడలేదు. కానీ, శ్రద్ధా వాకర్ హత్యతో వీటిపై మరోసారి ఫోకస్ చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
ఢిల్లీలో పాండవ్ నగర్లో నివసించే అంజన్ దాస్ను తల్లి పూనమ్, ఆమె కొడుకు దీపక్లు దారుణం చంపేశారు. ఓ అక్రమ సంబంధం కారణంగా అంజన్ దాస్ను తల్లి, కొడుకు చంపేసినట్టు తెలుస్తున్నది. ముందు అంజన్ దాస్కు నిద్ర మాత్రలు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతన్ని చంపేశారు. అనంతరం, ఆయన బాడీని ముక్కలుగా నరికేశారు. అవి కుళ్లిపోయి వాసన రాకుండా ఓ రిఫ్రిజిరేటర్లో పెట్టారు. అనంతరం వాటిని పాండవ్ నగర్, సమీప ప్రాంతాల్లో పడేశారు. కొన్ని బాడీ పార్టులను పాండవ్ నగర్లో జూన్లోనే పోలీసులు చూశారు. కానీ, వాటిని పట్టించుకోలేదని తెలుస్తున్నది.
Also Read: శ్రద్ధా వాకర్ హత్య కేసు... మొహరౌలీ అడవిలో పోలీసుల సోదాలు, వెలుగులోకి కీలక విషయాలు
సీసీటీవీ కెమెరాల్లో దీపక్ కదలికలను పోలీసులు గుర్తించారు. రాత్రి పూట దీపక్ ఓ బ్యాగ్ను తీసుకుని వెళ్లుతుండటాన్ని ఐడెంటిఫై చేశారు. ఆ బ్యాగులో బాడీ పార్టులు తీసుకెళ్లి పడేసి వచ్చినట్టు తెలుస్తున్నది. అందులో ఒక ట్రిప్ను సీసీటీవీ కెమెరాలో పోలీసులు చూశారు. ఆ ట్రిప్లో దీపక్ వెంట పూనమ్ కూడా కనిపించారు. మరో క్లిప్లో వారు డే లో కూడా బయట తిరుగుతున్నట్టు చూశారు. బహుశా ఆ డెడ్ బాడీ పార్టులను పడేయడానికి ప్లేస్లను వెతికే పనిలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల అప్తాబ్ పూనావాలా తన గర్ల్ఫ్రెండ్ శ్రద్ధా వాకర్ను ఢిల్లీలో దారుణం హతమార్చి ఆమె డెడ్ బాడీని 35 పీస్లుగా చేసి ఫ్రిడ్జీలో దాచిపెట్టాడు. రాత్రిపూట సుమారు 2 గంటల ప్రాంతంలో ఆ బాడీ పార్టులను దక్షిణ ఢిల్లీలోని పలు చోట్ల పడేసి వచ్చాడు. శ్రద్ధా వాకర్ తండ్రి మిస్సింగ్ కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. విచారణలో అప్తాబ్ పూనావాలా కలకలం రేపే విషయాలను వెల్లడించాడు.