మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది ఢిల్లీలో అరెస్ట్, అదుపులోకి మరో ఇద్దరు అనుమానితులు..
ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఐసిస్ ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారితో పాటు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పక్క సమాచారంతో ఓ రహస్య స్థావరంలో వారిని అరెస్టు చేశారు.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఐసిస్ ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జమా ను సోమవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా అదుపులోకి తీసుకుంది. కాగా ఇందులో మహ్మద్ షానవాజ్ తలపై రూ.3 లక్షల రివార్డు ఉంది.
దేశ రాజధానిలోని రహస్య స్థావరంలో వీరందరినీ అరెస్టు చేశారు. కాగా. పలు రాష్ట్రాల్లోని ఉగ్రవాద నెట్ వర్క్ లను అణచివేసేందుకు ఎన్ ఐఏతో కలిసి పనిచేస్తున్న పలు సంస్థల్లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా ఉంది. ఈ సెల్ పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేసింది. కాగా.. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన షానవాజ్ పుణె ఐసిస్ మాడ్యూల్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఢిల్లీకి చెందిన అతడు పుణె పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఢిల్లీలో తలదాచుకున్నాడు.
ప్రస్తుతం షానవాజ్ సహా మరో ముగ్గురు ఉగ్రవాదులు రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలా, తల్హా లియాకత్ ఖాన్ ల ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే వీరి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ఎన్ ఐఏ ఇటీవలే ప్రకటించింది.
షానవాజ్, అబ్దుల్లా, రిజ్వాన్ లు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఐసిస్ మిషన్ లో చేరినట్లు తెలిసింది. వీరికి మహారాష్ట్రలోని పుణెలో ఐసిస్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరు దేశంలో హింస, ఉగ్రవాదాన్ని సృష్టించాలనుకున్నారని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్థాలను అసెంబుల్ చేయడానికి ఉపయోగించే డైపర్ స్టోర్ ను అబ్దుల్లా పుణెలో నడుపుతున్నట్లు సమాచారం.
ఐఎస్ఐఎస్ లింకుల ఆరోపణలపై 2018లో ఢిల్లీకి చెందిన రిజ్వాన్ అలీని, అతడి తమ్ముడిని అరెస్టు చేసినప్పటికీ భద్రతా సంస్థలు వారికి వ్యతిరేకంగా ఆధారాలు కనుగొనలేకపోయాయి. డీరాడికలైజేషన్ కార్యక్రమం అనంతరం అతడిని విడుదల చేశారు. రెండేళ్ల క్రితం పుణె వెళ్లి కంప్యూటర్ వ్యాపారం చేస్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పాడు.
పెళ్లి చేసుకుని భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. రిజ్వాన్ తండ్రి అనారోగ్యానికి గురికావడంతో దంపతులు ఢిల్లీకి తిరిగి వచ్చారు. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కాగా.. ఈ అరెస్టు సమయంలో నిందితుల దగ్గర నుంచి ఐఈడీ తయారీకి ఉపయోగించే లిక్విడ్ కెమికల్ సహా పలు కీలక సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.