కొందరు నేరగాళ్లకు సహకరిస్తూ వారితో చోరీలు, దోపిడీలు చేయించేవాడు. చోరీ సొత్తును విక్రయించడానికి సహకరిస్తూ భారీగా కమీషన్లు తీసుకునేవాడు. 

అతను ఒకప్పుడు పోలీసు విభాగంలో పనిచేసిన వాడే. కానీ... ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. సులభంగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో పోలీసు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి వరసగా నేరాలు చేస్తూ.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిపోయాడు. కాగా.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఈ మాజీ పోలీసు కథేంటో ఓసారి చూస్తే..

హరియాణాలోని నుహ్‌ జిల్లాకు చెందిన అస్లుప్‌ పదేళ్ల క్రితం ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాడు. జల్సాలకు అలవాటుపడి తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు పెడదారి పట్టాడు. కొందరు నేరగాళ్లకు సహకరిస్తూ వారితో చోరీలు, దోపిడీలు చేయించేవాడు. చోరీ సొత్తును విక్రయించడానికి సహకరిస్తూ భారీగా కమీషన్లు తీసుకునేవాడు. 

ఆరేళ్ల క్రితం ఇది గుర్తించిన ఢిల్లీ పోలీసులు అస్లుప్‌ను అరెస్టు చేశారు. దీంతో ఉద్యోగం కోల్పోయిన అతడు జైలు నుంచి బయటకొచ్చాక నేరాలు చేయడాన్నే వృత్తిగా చేసుకున్నాడు. ఏటీఎంల్లో చోరీలు, హత్యాయత్నాలు, దాడులు, దొంగతనాలు చేయడంలో ఆరితేరాడు. 

పోలీసులకు చిక్కకుండా, తన ఉనికి బయటపడకుండా ఈ నేరాలన్నీ ఒంటరిగానే చేసేవాడు. హైదరాబాద్‌తో పాటు హరియాణా, కేరళ, మహారాష్ట్ర, కోల్‌కతా, గుజరాత్, రాజస్తాన్, ఒడిశాలోని పలు నగరాల్లో మొత్తం 24 నేరాలు చేసిన ఇతడు మోస్ట్‌ వాంటెట్‌గా మారాడు. హరియాణా పోలీసులు రూ.50 వేల రివార్డు సైతం ప్రకటించారు.

గత శుక్రవారం.. ఢిల్లీ–అల్వాల్‌ హైవేపై ఉన్న కేఎంపీ రోడ్‌లోని రేవాసన్‌ హోటల్‌ వద్ద ఇతడిని వలపన్ని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అస్లుప్‌ను కోర్టులో హాజరుపరిచిన సీఐఏ తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుంది.