యూపీ బ్లాక్ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం: మోడీ అభినందన
త్వరలో యూపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బ్లాక్ పంచాయితీ చీఫ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయంపై మోడీ పార్టీ కార్యకర్తలను అభినందించారు. యూపీ సీఎం అమలు చేసిన పథకాలతో ప్రజలు పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బ్లాక్ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. యూపీ రాష్ట్రంలో బ్లాక్ పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రజా ప్రయోజన పథకాల ద్వారా ప్రజాలకు లభించిన ప్రయోజనాలతో రాష్ట్రంలో పార్టీకి భారీ విజయాన్ని సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యకర్తలంతా ఈ విజయానికి అభినందనలకు అర్హులేనని ఆయన చెప్పారు.
ఇవాళ బ్లాక్ పంచాయితీ చీఫ్ ఎన్నికలు జరిగాయి. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. కడపటి వార్తలు అందే సమయానికి కనౌజ్, లక్నో ల్లో 8 బ్లాకుల్లో 6 స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. సీతాపూర్ లో 19 స్థానాల్లో 15 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఎస్పీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ముజఫర్ నగర్ లో 9 స్థానాల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది. మరో స్థానంలో ఆర్ఎల్డీ విజయం సాధించింది.అజంఘర్ లో 12 స్థానాలను బీజేపీ గెలుచుకొంది.